చెన్నై: మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియంలో మరికొద్ది సేపట్లో మొదటి వన్డే ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మూడో టీ20 మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ గాయడిన భారీ హిట్టర్ ఎవిన్ లూయిస్కు విశ్రాంతి ఇచ్చారు. అతని స్థానంలో సునీల్ అంబ్రీస్ జట్టులోకి వచ్చాడు. ఒకవేళ టాస్ గెలిస్తే మొదట బ్యాటింగ్ చేయాలనుకున్నట్లు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు.
అరుదైన రికార్డుకు చేరువలో కోహ్లీ.. రోహిత్ పోటీ!!
టీమిండియాలోకి శివమ్ దూబే వన్డే అరంగేట్రం చేసాడు. మొహమ్మద్ షమీ, దీపక్ చాహర్ పేస్ బాధ్యతలను మోయనున్నారు. రవీంద్ర జడేజా స్థానం నిలుపుకున్నాడు. ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫామ్లో ఉండడంతో యువ సంచనలం మయాంక్ అగర్వాల్కు చోటు దక్కలేదు. బ్యాటింగ్తో పాటు వికెట్ కీపింగ్లో దారుణంగా విఫలమైన రిషబ్ పంత్పై టీమ్ మేనేజ్మెంట్ నమ్మకముంచింది. తొలి వన్డే తుది జట్టులో పంత్ చోటు దక్కించుకున్నాడు. మనీశ్ పాండేకు నిరాశే ఎదురైంది. కేదార్ జాదవ్ చోటు కాపాడుకున్నాడు.
చెన్నైలో భారత్ ఇప్పటివరకు 12 వన్డేలు ఆడింది. ఏడు మ్యాచ్ల్లో గెలిచి, నాలుగింటిలో ఓడిపోయింది. మరో మ్యాచ్ రద్దయింది. ఇదే వేదికపై వెస్టిండీస్తో టీమిండియా నాలుగుసార్లు తలపడింది. రెండు మ్యాచ్ల్లో గెలుపొంది, మరో రెండు మ్యాచ్ల్లో ఓడిపోయింది. చివరిసారి ఈ రెండు జట్ల మధ్య ఇక్కడ జరిగిన రెండు వన్డేల్లో భారత్ విజయం సాధించింది.
గత రెండు రోజులు వర్షం పడటంతో పిచ్ను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. చెపాక్ పిచ్ స్లోగా ఉంటూ.. స్పిన్నర్లకు అనుకూలించే అవకాశం ఉంది. చివరిసారి రెండేళ్ల క్రితం ఆస్ట్రేలియాతో ఇక్కడ జరిగిన వన్డేలో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 281 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఆసీస్ ఇన్నింగ్స్ను 21 ఓవర్లకు కుదించి లక్ష్యాన్ని 164 పరుగులుగా నిర్ణయించారు. ఆసీస్ 9 వికెట్లకు 137 పరుగులు చేసి ఓడిపోయింది. చాహల్, కుల్దీప్ ఐదు వికెట్లు తీసి జట్టును గెలిపించారు.
జట్లు:
భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ.
వెస్టిండీస్: షెయ్ హోప్, సునీల్ ఆంబ్రోస్, హెట్మైర్, నికోలస్ పూరన్, రోస్టన్ ఛేజ్, కీరన్ పొలార్డ్, జేసన్ హోల్డర్, కీమోపాల్, హేడన్ వాల్ష్, ఆల్జారీ జోసెఫ్, షెల్డన్ కాట్రెల్.