హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో మాట్లాడిన పెప్ టాక్ తనకు భారత టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడంలో సాయపడిందని హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ వెల్లడించాడు. టెస్టుల్లో భారత్ తరుపున ప్రాతినిథ్యం వహించడం అనేది ప్రతి ఒక్క క్రికెటర్ కల.
భారత్ Vs వెస్టిండిస్: ఈ నలుగురు ఆటగాళ్లకు సిరిస్ ఎంతో ప్రత్యేకం
సుదీర్ఘ ఫార్మాట్లో జాతీయ జట్టుకు ఆడటం అనేది ఎంతో గౌరవం. అలాంటి గౌరవాన్ని హైదరాబాద్ బౌలర్ మహ్మద్ సిరాజ్ త్వరలో పొందనున్నాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో సిరాజ్ అద్భుత ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్న సెలక్టర్లు విండిస్తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్కు ఎంపిక చేశారు.
వెస్టిండిస్తో రెండు టెస్టుల సిరిస్కు ప్రకటించిన జట్టులో చోటు దక్కించుకున్న సిరాజ్ సెలక్టర్ల నుంచి తనకు పిలుపు రావడం వెనుక టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడని ఓ జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్యూలో వెల్లడించాడు. "బ్యాట్స్మన్ పుట్వర్క్ని బాగా గమనించి అందుకు తగినట్లుగా లైన్ అండ్ లెన్త్ మార్చుకో" అని ధోని తనకు సలహా ఇచ్చినట్లు సిరాజ్ తెలిపాడు.
ఈ సలహా తన ఆటతీరుని మరింతగా మెరుగుపరచుకునేందుకు సాయపడిందని సిరాజ్ వెల్లడించాడు. గతేడాది నవంబర్లో న్యూజిలాండ్తో తన అరంగేట్ర టీ20లో తన మాటలతో కెప్టెన్ విరాట్ కోహ్లీ తనలోని భయాన్ని పూర్తిగా పొగొట్టాడని తెలిపాడు.
"గతేడాది న్యూజిలాండ్తో జరిగిన టీ20కి గాను నేను జట్టులో చోటు దక్కించుకున్నప్పుడు, విరాట్ కోహ్లీ భాయ్తో చాట్ చేశాను. అప్పుడు నాలో కొంత భయం ఉండేది. అప్పుడు కోహ్లీ 'ఆందోళన చెందకు, మనం మైదానంలో మాట్లాడుకుందా. నీ అరంగేట్ర మ్యాచ్కి సిద్ధంగా ఉండు' అని అన్నాడు" అని సిరాజ్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.
అఫ్రిదితో వెల్లడి: సెహ్వాగ్ను భయపెట్టిన బౌలర్ ఎవరో తెలుసా?
"మైదానంలోకి అడుగుపెట్టిన తర్వాత కోహ్లీ నాతో మాట్లాడుతూ 'నేను నీ గేమ్ను చూశాను. నీ సహాజ సిద్ధమైన బౌలింగ్ను వేయి. ప్రయోగాలు చేయకు. అలా ఒత్తిడిని నా నుంచి దూరం చేశాడు' అని సిరాజ్ తెలిపాడు.
"నా తండ్రి ఆటో రిక్షా డ్రైవర్. నేను క్రికెటర్గా ఎదిగేందుకు అతను ఎంతగానో కష్టపడ్డాడు. ఎన్నింటికో ఓర్చుకుని నన్ను ఈస్థాయికి తీసుకొచ్చిన తండ్రి గర్వపడేలా చేయడమే నా కర్తవ్యం. ఈ క్రమంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా అధిగమిస్తా. టెస్ట్ జట్టుకు ఎంపికవ్వడం ద్వారా నా కల నెరవేరింది. ఏదో ఒక రోజు సెలెక్టర్ల నమ్మకాన్ని చూరగొంటానన్న నమ్మకం నాకుండేది. ఇటీవలి భారత్ ఎ తరఫున రాణించడం ద్వారా జాతీయ జట్టులో చోటు దక్కింది" అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో సిరాజ్ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వికెట్ పడగొట్టాడు. తన తొలి వికెట్ ఓ జాతీయ జట్టు కెప్టెన్ది కావడంపై సిరాజ్ సంతోషం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్ సిరిస్ తర్వాత నిదాహాస్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్, శ్రీలంక జట్లతో జరిగిన మ్యాచ్ల్లో సిరాజ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.
అయితే, ఇండియా-ఏ జట్టు తరుపున అద్భుత ప్రదర్శన చేసిన సిరాజ్ వెస్టిండిస్తో జరగనున్న రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్-వెస్టిండిస్ జట్ల మధ్య అక్టోబర్ 4న రాజ్ కోట్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది.