ట్రినిడాడ్: ప్రత్యేకంగా నాలుగో స్థానం గురించి ఆలోచించడం లేదు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని టీమిండియా యువ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. వెస్టిండీస్ పర్యటనలో లిమిటెడ్ ఫార్మాట్ జట్టులో శ్రేయస్ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. మొదటి వన్డే తుది జట్టులోకి ఎంపికయినా.. వర్షం కారణంగా ఆ మ్యాచులో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఆదివారం రాత్రి పోర్ట్ ఆఫ్ స్పెయిన్లోని క్వీన్స్పార్క్ ఓవల్ మైదానంలో జరిగే రెండో వన్డేలో వెస్టిండీస్, భారత్ తలపడనున్నాయి. ఇరు జట్లు దాదాపు మార్పుల్లేకుండానే బరిలో దిగే సూచనలు ఉన్నాయి.
ఆగస్టు 15 తర్వాతే టీమిండియా హెడ్ కోచ్ ఎంపిక
రెండో వన్డే తుది జట్టులో శ్రేయస్ అయ్యర్కు చోటు ఖాయం. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ మీడియాతో మాట్లాడుతూ... 'నాలుగో స్థానంలో ఎవరిని పంపాలన్నది జట్టు యాజమాన్యందే తుది నిర్ణయం. ఈ స్థానంలోనే రావాలనే సమస్య లేదు. నన్ను ఎక్కడ దింపుతారనేది నాకు తెలీదు. అది పూర్తిగా మేనేజ్మెంట్ నిర్ణయం. నాలుగో స్థానంలో పంపితే అందుకు న్యాయం చేయడానికి యత్నిస్తా. ప్రత్యేకంగా నాలుగో స్థానం గురించి ఆలోచించడం లేదు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటా. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేస్తా' అని అయ్యర్ తెలిపారు.
అంతకుముందు శ్రేయస్ అయ్యర్ మాట్లాడాడు. 'నిజంగా ప్రతిభావంతుడైన ఆటగాడు నిరూపించుకోవడానికి, పరిస్థితులకు అలవాటు పడటానికి తగినన్ని అవకాశాలివ్వాలి. ప్రతిసారి జట్టులోకి వస్తూ పోతూ ఉంటే ఆటగాడి ఆత్మవిశ్వాసం కోల్పోతాడు. జట్టులోకి ఎంపిక కానప్పుడు కొన్నిసార్లు ఆటగాడు సహనం కోల్పోవచ్చు. కానీ.. ఎంపిక మన చేతుల్లో ఉండదు. మెరుగైన ప్రదర్శన చేయడం మాత్రమే ఆటగాడి చేతుల్లో ఉంటుంది' అని అయ్యర్ తెలిపాడు.
పృథ్వీ షాకు దగ్గు, జలుబు లేదు.. డోప్ టెస్ట్లో కొత్త కోణం
మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డే వర్షం కారణంగా రద్దయిన నేపథ్యంలో ఇరు జట్లు రెండో వన్డేలో విజయం సాధించి ఆధిక్యం సాధించాలని భావిస్తున్నాయి. టీ20 సిరీస్ కోల్పోయిన ఆతిథ్య వెస్టిండీస్.. కనీసం వన్డే సిరీస్ను గెలవాలనే పట్టుదలగా ఉంది. మరోవైపు వన్డే సిరీస్ను కూడా గెలిచి తమ ఖాతాలో వేసుకోవాలని టీమిండియా చూస్తోంది.