చివరిసారిగా 2006లో వన్డే మ్యాచ్
1937లో ప్రారంభమైన ఈ మైదానంలో చివరిసారిగా 2006లో వన్డే మ్యాచ్ జరిగింది. అయితే టీమిండియా మాత్రం ఈ స్టేడియంలో వన్డే మ్యాచ్ ఆడటం 23ఏళ్ల తర్వాత తొలిసారి కావడం విశేషం. బ్రబౌర్న్ స్టేడియం కూడా వాంఖడెకు అతి సమీపంలోనే ఉండటం విశేషం. నిజానికి బ్రబౌర్న్ స్టేడియం నిర్వాహకులు, క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా(సీసీఐ) మధ్య తరచూ వివాదాలు జరుగుతుంటాయి. దీంతో 1970ల నుంచి ముంబైలో అంతర్జాతీయ మ్యాచ్లు నిర్వహించాలంటే ముంబయి క్రికెట్ అసోసియేషన్ వాంఖడే స్టేడియాన్ని ఎంచుకోవడం విశేషం.
బ్రబౌర్న్ స్టేడియంతో సచిన్ టెండూల్కర్కు అనుబంధం
ఈ మ్యాచ్కి ముందు ఆరంభ గంటను కొట్టడానికి క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ను ఆహ్వానించినట్లు స్టేడియం నిర్వాహకులు తెలిపారు. మ్యాచ్కు ముందు ఆరంభ గంటను కొట్టే సంప్రదాయం ఇంగ్లాండ్లోని చరిత్రాత్మక లార్డ్స్ క్రికెట్ మైదానంలో మొదలైంది. భారత్లో కోల్కతాలోని ఈడెన్గార్డెన్స్లోనూ ఈ గంట కొట్టే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఏదైనా టెస్టు మ్యాచ్ ప్రారంభమయ్యే రోజున ప్రముఖ క్రికెటర్లను గంట కొట్టేందుకు ఆహ్వానిస్తుంటారు.
వీరేంద్ర సెహ్వాగ్
ఇదే బ్రబౌర్న్ స్టేడియంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ డబుల్ సెంచరీని సాధించాడు. శ్రీలంకతో జరిగన మ్యాచ్లో వీరేంద్ర సెహ్వాగ్ 254 బంతుల్లో 40 ఫోర్లు 7 సిక్సుల సాయంతో 293 పరుగులు సాధించాడు. తద్వారా క్రికెట్ చరిత్రలో మూడు ట్రిపుల్ సెంచరీలకు చేరువగా వచ్చిన క్రికెటర్గా వీరేంద్ర సెహ్వాగ్ అరుదైన ఘనత సాధించాడు.
ఈ స్టేడియంలో గత రికార్డు
బ్రబౌర్న్ మైదానంలో టీమిండియా ఒకే ఒక్క వన్డే ఆడింది. 1995లో న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 1995 తర్వాత మళ్లీ టీమిండియా ఈ మైదానంలో ఆడలేదు. 2006లో ఆస్ట్రేలియా, వెస్టిండిస్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్లో వెస్టిండిస్ను ఓడించి ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ దక్కించుకుంది. బ్రబౌర్న్ స్టేడియంలో ఇప్పటివరకు 18 టెస్టులు, 8 వన్డేలు, ఒక్క టీ 20 మ్యాచ్ జరిగింది. ఈ స్టేడియంలో జరిగిన మొత్తం 18 టెస్టుల్లో 11 టెస్టుల్లో ఫలితం తేలలేదు. ఇక్కడ 7 టెస్టుల్లో ఐదింటిలో భారత్ విజయం సాధించగా.. వెస్టిండిస్, ఆస్ట్రేలియా చెరొకటి గెలిచాయి.