|
టాస్ గెలిచిన వెస్టిండిస్ కెప్టెన్
ఈ సిరీస్లో నాలుగు టాస్లనూ కోహ్లీయే గెలిచిన సంగతి తెలిసిందే. ఐదో వన్డేలోనూ టాస్ గెలిస్తే సొంతగడ్డపై జరిగిన ద్వైపాక్షిక సిరీస్లో ఈ ఘనత సాధించిన ఏకైక భారత కెప్టెన్గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించేవాడు. దీంతో పాటు ఓ సిరీస్లో వరుసగా ఐదు టాస్లు గెలిచిన నాలుగో భారత కెప్టెన్ అయ్యేవాడు.
టాస్ ఓటమితో కోహ్లీ రికార్డు మిస్
గతంలో అజహరుద్దీన్, మహేంద్ర సింగ్ ధోనీ, రాహుల్ ద్రవిడ్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇక, వెస్టిండిస్ జట్టుపై ఇలా వరుసగా ఐదు మ్యాచ్ల్లో టాస్లు గెలిచిన కెప్టెన్లలో హ్యాన్సీ క్రోనే(దక్షిణాఫ్రికా), స్టీవ్ వా(ఆస్ట్రేలియా) ఉన్నారు. ఐదు వన్డేల ఈ సిరీస్లో ఇప్పటికే నాలుగు వన్డేలు ముగియగా.. భారత్ జట్టు 2-1తో ఆధిక్యంలో కొనసాగుతోంది.
తొలి మూడు వన్డేల్లో విండిస్ గట్టి పోటీ
తొలి మూడు వన్డేల్లోనూ కోహ్లీసేనకు గట్టిపోటీనిచ్చిన వెస్టిండిస్ ముంబై వేదికగా జరిగిన నాలుగో వన్డేలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ మ్యాచ్లో వెస్టిండిస్ జట్టు 224 పరుగుల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆఖరి వన్డేలో కూడా విజయం సాధించి సిరీస్ని 3-1తో చేజిక్కించుకోవాలని కోహ్లీసేన ఉవ్విళ్లూరుతోంది.
చివరి వన్డేలో గెలవాలనే తపనతో విండిస్
మరోవైపు చివరి వన్డేలో గెలిచి సిరీస్ని 2-2తో సమం చేయాలని పర్యాటక వెస్టిండీస్ జట్టు కూడా ఆశిస్తోంది. ఈ సిరిస్ విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డే టైగా ముగిసిన సంగతి తెలిసిందే. తిరువనంతపురంలో వాతావరణం మ్యాచ్కు కలిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వాతావరణం మేఘావృతం కావడంతో ఏ క్షణమైనా వర్షం పడే అవకాశం ఉంది.