

హైదరాబాద్: ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో వెస్టిండిస్తో జరుగుతున్న 4వ వన్డేలో ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి పేలవ ప్రదర్శనతో పెవిలియన్కు చేరాడు. ఈ మ్యాచ్లో శిఖర్ ధావన్ (38) పరుగుల వద్ద ఫాస్ట్ బౌలర్ కీమో పాల్ బౌలింగ్లో ఔటయ్యాడు.
ధావన్ ఔటైన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇన్నింగ్స్ 12వ ఓవర్ వేసిన కీమో పాల్ బౌలింగ్లో బంతిని మిడ్వికెట్ దిశగా తరలించేందుకు ధావన్ ప్రయత్నించాడు. కానీ.. బంతి బ్యాట్కి సరిగా కనెక్ట్ కాకపోవడంతో.. నేరుగా బంతి వెళ్లి కీరన్ పొవెల్ చేతుల్లో పడింది.
40 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 38 పరుగులు చేసిన ధావన్ పేలవరీతిలో వికెట్ చేజార్చుకున్నాడు. ఈ సిరిస్లో ఇప్పటివరకు ముగిసిన మూడు వన్డేల్లోనూ ధావన్ 4, 29, 35 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఏడాది ధావన్ ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు.
అయితే, ఇటీవలే యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్లో మాత్రం ధావన్ సెంచరీతో పాటు అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్గా నిలిచాడు. అయితే, ప్రస్తుతం వెస్టిండిస్తో జరుగుతున్న వన్డే సిరిస్లో ధావన్ పేలవ ప్రదర్శనపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శిస్తున్నారు.
మరోవైపు నాలుగో వన్డేలో ధావన్ ఔటైనప్పుడు వెస్టిండిస్ బౌలర్ అతడి తరహాలో తొడగొడుతూ సంబరాలు చేసుకున్నాడు. ఫీల్డింగ్ సమయంలో క్యాచ్ పట్టిన తర్వాత ధావన్ తొడగొడుతూ సంబరాలు చేసుకునే సంగతి అందరికీ తెలిసిందే. కీమో పాల్ తనని కవ్విస్తూ తొడగొట్టినా.. ధావన్ మాత్రం నవ్వుతూ పెవిలియన్కి వెళ్లిపోయాడు.