ఓపెనర్ల శుభారంభం:
316 లక్ష్య చేదనతో బరిలోకి దిగిన టీమిండియాకు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ విండీస్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. మొదటగా నెమ్మదిగా ఆడిన రోహిత్.. ఆ తర్వాత గేర్ మార్చి 52 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్తో హాఫ్ సెంచరీ చేశాడు. మరోవైపు రాహుల్ కూడా హాఫ్ సెంచరీ సాధించాడు.
కోహ్లీ హాఫ్ సెంచరీ:
రోహిత్ (63), రాహుల్ (77) మొదటి వికెట్కు 122 పరుగులు జోడించారు. రోహిత్ పెవిలియన్ చేరిన అనంతరం రాహుల్ తడబడినా.. విరాట్ కోహ్లీ (85) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ హాఫ్ సెంచరీ చేయగా.. మరోవైపు శ్రేయాస్ అయ్యర్ (7), రిషబ్ పంత్ (7), కేదార్ జాదవ్ (9) తీవ్రంగా నిరాశపరిచారు. అయితే జడేజా (39)తో కలిసి కోహ్లీ టీమిండియాను విజయానికి చేరువ చేసాడు.
శార్దూల్ సూపర్ ఇన్నింగ్స్:
కోహ్లీ అనూహ్యంగా బోల్డ్ కావడంతో చివర్లో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఒత్తిడి మొత్తం జడేజాపై ఉన్న సమయంలో శార్దూల్ ఠాకూర్ మెరుపులు మెరిపించాడు. క్రీజులోకి వచ్చిరావడంతోనే పరుగుల వరద పారించాడు. కేవలం 6 బంతుల్లో 17 పరుగులు చేసి కోహ్లీసేనకు అపురూప విజయాన్ని అందించాడు. వెస్టిండీస్పై భారత్ వరుసగా పదో సిరీస్ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో సొంతగడ్డపై తిరుగులేదని టీమిండియా మరోమారు నిరూపించుకుంది. మంచి విజయంతో టీమిండియా ఈ ఏడాదిని ముగించింది.
హెట్మెయిర్ మెరుపులు:
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్ (21), షాయ్ హోప్ (42) తొలి వికెట్కు శుభారంభాన్ని ఇచ్చారు. 57 పరుగుల వద్ద లూయిస్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రోస్టన్ చేజ్ (38) కూడా బ్యాట్ ఝళిపించాడు. హోప్ తర్వాత వచ్చిన షిమ్రన్ హెట్మెయిర్ (37) స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే నవ్దీప్ సైనీ వీరిద్దరినీ బోల్తా కొట్టించాడు.
పొలార్డ్ మోత:
ఆపై నికోలస్ పూరన్ (89), కెప్టెన్ కీరన్ పొలార్డ్ (74)లు భారత బౌలర్లపై విరుచుకుపడ్డారు. పొలార్డ్ అయితే సిక్సర్లతో చెలరేగాడు. వీరిద్దరి దెబ్బకు స్కోరు బోర్డు పరుగులు తీసింది. దీంతో విండీస్ భారీ పరుగులు చేసింది. భారత బౌలర్లలో సైనీ రెండు వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్, షమీ, జడేజాలు చెరో వికెట్ తీశారు.