నేడు చివరి వన్డే: సైనీ అరంగేట్రం.. పదో సిరీస్ రికార్డుపై భారత్ కన్ను!!

కటక్: భారత్-వెస్టిండీస్ జట్లు చివరి సమరానికి సిద్ధమయ్యాయి. టీ20 సిరీస్ను భారత్ గెలుచుకున్న అనంతరం జరిగిన రెండు వన్డేల్లో ఇరు జట్లు చెరొకటి నెగ్గి సమ ఉజ్జీగా నిలిచాయి. ఇక కటక్ వేదికగా ఇరు జట్లు ఆదివారం జరిగే నిర్ణయాత్మక పోరుకు సై అంటున్నాయి. బలాబలాలపరంగా భారత్దే పైచేయి అయినా.. ఈ పర్యటనలో విండీస్ ఆటను చూస్తే తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. పదో ద్వైపాక్షిక సిరీస్ సాధించాలనే లక్ష్యంతో కోహ్లీసేన ఉంటే.. మరోవైపు 13 ఏళ్లుగా ఊరిస్తున్న సిరీస్ విజయాన్ని ఈసారైనా ఒడిసిపట్టుకోవాలని విండీస్ పట్టుదలతో ఉంది.

ఫామ్లో టాపార్డర్
ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తిరుగులేని బ్యాటింగ్ మరోసారి భారత్కు శుభారంభం అందిస్తే విండీస్ జట్టుకు కష్టాలు తప్పవు. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈసిరీస్లో ఇంకా బ్యాట్ ఝుళిపించలేదు. ఈ మ్యాచ్లో ఆ లోటు తీరితే భారత్కు మరోసారి భారీ స్కోరు ఖాయమే. మిడిలార్డర్లో శ్రేయాస్ అయ్యర్ వరుస అర్ధ సెంచరీలతో దూసుకెళ్తున్నాడు. ఇక రిషబ్ పంత్ కూడా ట్రాక్లోకి వచ్చాడు. ఈ మ్యాచ్లోనూ జట్టు వీరి నుంచి ,మంచి ఇన్నింగ్సే ఆశిస్తోంది.

సైనీ అరంగేట్రం:
కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా పటిష్టంగానే ఉంది.గాయపడిన దీపక్ చాహర్ స్థానంలో వచ్చిన నవ్దీప్ సైనీ ఈ మ్యాచ్తో వన్డేల్లో అరంగేట్రం చేసే అవకాశాలు ఉన్నాయి. భువనేశ్వర్ కుమార్ స్థానంలో వచ్చిన శార్దూల్ ఠాకూర్ రెండో వన్డేలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. హ్యాట్రిక్ హీరో కుల్దీప్ యాదవ్ తన స్పిన్ పవర్ చూపాలనుకుంటున్నాడు. అయితే జడేజా మాత్రం ధారాళంగా పరుగులిస్తున్నాడు.మొహమ్మద్ షమీ బౌలింగ్ విభాగాన్ని నడిపించనున్నాడు.

భారత్కు దీటుగానే:
సిరీస్ ఆరంభ మ్యాచ్లో విండీస్ అన్ని విభాగాల్లోనూ రాణించింది. కానీ.. విశాఖ మాత్రం ఒక్కసారిగా డీలాపడింది. షాయ్ హోప్, లూయిస్, హెట్మయెర్, పూరన్, పొలార్డ్లతో బ్యాటింగ్ విభాగం భారత్కు దీటుగానే కనిపిస్తోంది. పేసర్ కాట్రెల్ సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. అతనికి జోసెఫ్, హోల్డర్ అండగా నిలవడం ముఖ్యం. స్పిన్నర్ ఖారీ పైర్ భారీగా పరుగులు ఇస్తున్న నేపథ్యంలో హేడెన్ వాల్ష్ను ఆడించే అవకాశం ఉంది.

పిచ్, వాతావరణం:
బారాబతి పిచ్ బ్యాట్స్మెన్కు స్వర్గధామం. భారీ స్కోరుకు అవకాశం ఉంది. మూడేళ్ల క్రితం ఇక్కడ జరిగిన చివరి వన్డేలో 381 పరుగులు సాధ్యమయ్యాయి. మంచు ప్రభావం కూడా ఉంది కాబట్టి మరోసారి టాస్ గెలిచే జట్టు ఫీల్డింగ్కు మొగ్గు చూపడం ఖాయం. మ్యాచ్కు వర్షం నుంచి ముప్పు లేదు. మధ్యాహ్నం:1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

తుది జట్లు(అంచనా):
భారత్: రోహిత్శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, నవ్దీప్ సైనీ, శార్దూల్ ఠాకూర్/యజువేంద్ర చాహల్.
వెస్టిండీస్: ఎవిన్ లూయిస్, షాయ్ హోప్ (వికెట్ కీపర్), హెట్మయెర్, రోస్టన్ చేజ్, నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్ (కెప్టెన్), జేసన్ హోల్డర్, కీమో పాల్, అల్జారీ జోసెఫ్, ఖారీ పైర్/హేడెన్ వాల్ష్, కాట్రెల్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications