57 పరుగుల భాగస్వామ్యం:
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన విండీస్ ఇన్నింగ్స్ ఆరంభంలో నెమ్మదిగా ఆడింది. ఓపెనర్లు షాయ్ హోప్, ఎవిన్ లూయిస్ ఆచితూచి ఆడారు. భారత బౌలర్లను ఎదుర్కొంటూ 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జడేజా బౌలింగ్లో లూయిస్ మొదటి వికెట్ రూపంలో పెవిలియన్ చేరాడు. లూయిస్ 50 బంతుల్లో మూడు బౌండరీలతో 21 పరుగులు సాధించాడు. ఆ తర్వాత 70 పరుగుల వద్ద మరో ఓపెనర్ షాయ్ హోప్ (42) ఔట్ అయ్యాడు.
ఆశలు రేకెత్తించిన సైనీ:
ఈ క్రమంలో రోస్టన్ చేజ్ (38), షిమ్రన్ హెట్మెయిర్ (37)లు జట్టును ఆదుకున్నారు. చేజ్ స్ట్రైక్ రొటేట్ చేయగా.. హెట్మయెర్ రెచ్చిపోయాడు. అయితే క్రీజులో కుదురుకున్న ఈ జోడీని నవ్దీప్ సైనీ వెంటవెంటనే పెవిలియన్ పంపి భారత శిబిరంలో కాస్త ఆశలు రేకెత్తించాడు. అయితే ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. క్రీజులో కుదురుకున్న పూరన్, పొలార్డ్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు.
పూరన్ హాఫ్ సెంచరీ:
అర్ధ సెంచరీ వరకు నిదానంగా ఆడిన పూరన్.. ఆ తర్వాత గేర్ మార్చాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో పూరన్ 44 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసాడు. ఆపై రెచ్చిపోయి 64 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 89 పరుగులు చేసాడు. అయితే శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో భారీ షాట్ ఆడి జడేజాకు చిక్కాడు.
సిక్సర్లతో విరుచుకుపడ్డ పొలార్డ్:
పూరన్ ఔట్ అయ్యేవరకు నెమ్మదిగా ఆడిన పొలార్డ్.. ఆ తర్వాత భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. అతడి దెబ్బకు స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఒకానొక దశలో 250 మార్క్ కూడా దాటదనుకున్న విండీస్ స్కోరు 300 దాటింది. 51 బంతులు ఆడిన పొలార్డ్ 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. భారత ఫీల్డర్ల వైఫల్యం కూడా వారికి కలిసొచ్చింది.