చెన్నై: భారత్-వెస్టిండీస్ మధ్య చెన్నై చెపాక్ స్టేడియంలో జరుగుతున్న మొదటి వన్డేలో విండీస్ బ్యాట్స్మెన్ షిమ్రాన్ హెట్మయిర్ చెలరేగాడు. హెట్మయిర్ కేవలం 85 బంతుల్లో 4 సిక్స్లు, 8 ఫోర్లతో సెంచరీ చేసాడు. వన్డేల్లో హెట్మయిర్కు ఇది ఐదవ సెంచరీ కాగా.. టీమిండియాపై రెండో సెంచరీ. హెట్మయిర్ సెంచరీకి తోడు షై హోప్ (105 బంతుల్లో 58: 4 ఫోర్లు) కూడా హాఫ్ సెంచరీ చేయడంతో.. విండీస్ జట్టు విజయం దిశగా దూసుకెళుతోంది.
కోహ్లీకి ఎవరూ పోటీలేరు.. అతడికి అతడే పోటీ!!
288 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ ఇన్నింగ్స్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ సునీల్ అంబ్రీస్ (9) త్వరహాగానే చేరాడు. పేసర్ దీపక్ చాహర్ బౌలింగ్లో ఎల్బీగా ఔట్ అయ్యాడు. అనంతరం హెట్మయిర్ రాకతో విండీస్ ఇన్నింగ్స్ కుదురుకుంది. అతడు వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు, సిక్సర్లు బాదడంతో విండీస్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. మరోవైపు హోప్ అతనికి చక్కటి సహకారం అందించాడు.
హెట్మయిర్ దూకుడుగా ఆడుతూ 50 బంతుల్లో 50 పరుగులు చేసాడు. ఇక స్పిన్నర్ జడేజా బౌలింగ్ చేసిన 22వ ఓవర్ ఐదో బంతికి, ఆరో బంతికి వరుసగా రెండు సిక్స్లు కొట్టి బెంబేలెత్తించాడు. మరోవైపు హోప్ కూడా హాఫ్ సెంచరీ అందుకున్నాడు. హాఫ్ సెంచరీ అనంతరం మరింత రెచ్చిపోయిన హెట్మయిర్.. 80 బంతుల్లోనే సెంచరీ చేసాడు. ఈ జోడి ఇప్పటికే 193 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. భారత్ బౌలర్లు విండీస్ బ్యాట్స్మెన్ను ఔట్ చేసేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
విండీస్ జట్టు 37 ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టానికి 206 పరుగులు చేసింది. హోప్ (69), హెట్మయిర్ (119) క్రీజులో ఉన్నారు. విండీస్ విజయానికి 81 బంతుల్లో 81 పరుగులు చేయాలి. మొదటగా బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. టీమిండియా యువ బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్ (70), రిషబ్ పంత్ (71)లు హఫ్ సెంచరీలతో రాణించారు. విండీస్ బౌలర్లలో కాట్రెల్, జోసఫ్, కీమో పాల్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.