
హైదరాబాద్: ఈడెన్ గార్డెన్స్లో భారత విజయాన్ని చీకటి కమ్మేసింది. నవంబర్ 16(గురువారం) టెస్టు ప్రారంభమైన తొలి రోజు నుంచి చివరి రోజు వరకు చీకటిదే పైచేయి అయింది. ఉత్కంఠ భరితంగా సాగిన తొలి టెస్టు చివరి రోజు భారత్ జట్టులో విజయం ఆశలు రేపగా, శ్రీలంకను తీవ్ర ఒత్తిడికి గురి చేసింది.
తొలి ఇన్నింగ్స్లో శ్రీలంక ఆధిపత్యం చెలాయించగా.. రెండో ఇన్నింగ్స్లో పుంజుకున్న భారత్.. పర్యాటక జట్టుకు ముచ్చెమటలు పట్టించింది. విరాట్ కోహ్లీ అద్భుత శతకంతో టీమిండియా భారీ స్కోరుకు బాటలు వేయగా.. పేసర్లు భువీ, షమీ వరుస బెట్టి వికెట్లు తీసి ఆఖరి రోజు లంకను ఓటమి అంచుల్లోని నెట్టారు.
ముచ్చటగా మూడు వికెట్లు తీస్తే చాలు... తొలి టెస్టులో కోహ్లీసేన గెలుపు ఖాయమనుకున్న సమయంలో వెలుతురులేమితో ఆట నిలిచిపోయింది. ఈ దశలో 75/7 స్కోరుతో ఓటమికి చేరువైన లంక ఊపిరి పీల్చుకుంది. దీంతో మ్యాచ్ 'డ్రా'గా ముగిసింది. ఐదో రోజైన సోమవారం.. విరాట్ కోహ్లీ సెంచరీతో చేలరేగడంతో భారత్ 352/8 వద్ద రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.

దీంతో ప్రత్యర్ధి ముంగిట 231 పరుగుల లక్ష్యం ఉంచింది. లక్ష్య ఛేదనలో శ్రీలంక.. భువనేశ్వర్ (4/8), మహ్మద్ షమీ(2/34)ల ధాటికి విలవిలలాడింది. రెండో ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఏ దశలోనూ కోలుకోలేదు. వరుస వికెట్లను కోల్పోతూ లక్ష్యచేధనలో తడబడింది.
కానీ ఈ క్రమంలో ఆట ముందుకు సాగకుండా ఉండేందుకు లంక ఆటగాళ్లు చాలా విధాలుగా ప్రయత్నించారు. పదే పదే డ్రింక్స్ తీసుకురావడంతోపాటు లంక ఫిజియోథెరపిస్ట్ అవసరం లేకున్నా గ్రౌండ్లోకి పరిగెత్తుకొచ్చాడు. బంతిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ.. డిక్వెల్లా షమీని ఆగమంటూ హైడ్రామా క్రియేట్ చేశాడు.

అతడి తీరు పట్ల షమీ అసహనం వ్యక్తం చేయగా.. కోహ్లీ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. చివరకు ఫీల్డ్ అంపైర్లు రంగంలోకి దిగి శాంతిపచేశారు. కాగా తొలి టెస్టు ముగిసిన అనంతరం శ్రీలంక మాజీ కెప్టెన్ జయవర్దనే ఓ ట్వీట్ చేశాడు. 'ఈ మధ్యాహ్నం నిరోషాన్ డిక్వెల్లా దృక్పథం, కొంటె చేష్టలను ఎంజాయ్ చేశాను. బాగా ఆడావ్ విరాట్ కోహ్లీ. తర్వాతి టెస్టు కోసం ఎదురు చూస్తున్నా' అని ట్వీట్ చేశాడు.
జయవర్దనే ట్వీట్కు విరాట్ కోహ్లీ హుందాగా ప్రవర్తించాడు. 'అవును టెస్టు క్రికెట్ బెస్ట్ అని మరోసారి రుజువైంది. తర్వాతి మ్యాచ్ కోసం సిద్ధ పడుతున్నాం' అని ట్వీట్ చేశాడు.
డిక్వెల్లా అనవసరంగా సమయాన్ని వృధా చేసినప్పటికీ.. విరాట్ కోహ్లీ కాంట్రవర్సీల జోలికి పోలేదు. మరోవైపు భారత క్రికెట్ అభిమానులు మాత్రం డిక్వెల్లా ఉద్దేశపూర్వకంగా సమయం వృథా చేయడంపై మండి పడుతున్నారు. 'డిక్వెల్లా చేష్టలను జయవర్దనే లాంటి ఆటగాడు ప్రశంసించడం.. నిజంగా ఆశ్చర్యంగా ఉంది. మీరు మ్యాచ్ను కాపాడుకొని ఉండొచ్చు. కానీ అభిమానుల దగ్గర గౌరవాన్ని కోల్పోయారు' అని నెటిజన్ ట్వీట్ చేశాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.