
కొలంబో: శ్రీలంకపై రెండో వన్డే విజయం అనంతరం టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ డ్రెస్సింగ్ రూమ్లో ఆటగాళ్లకు దిశానిర్దేశం చేశాడు. ఈ విజయం చాలా గొప్పదని, మ్యాచ్లో అందరు మంచి ప్రదర్శన కనబరిచారని ప్రశంసలు కురిపించాడు. ఒకవేళ మ్యాచ్లో ఓడిపోయినా తాను పెద్దగా పట్టించుకునే వాడిని కాదని ద్రవిడ్ అన్నాడు. ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో అసలు మ్యాచ్పై ఆశలు లేని స్థితి నుంచి దీపక్ చహర్ ఫైట్తో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. ద్రవిడ్ ఇచ్చిన ఎమోషనల్ స్పీచ్ నెట్టింట వైరల్గా మారింది. ద్రవిడ్ వ్యాఖ్యలను భారత నియంత్రణ మండలి (బీసీసీఐ) ట్విటర్లో షేర్ చేసింది.
రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ... 'లంక ప్లేయర్స్ బాగా ఆడారు.. కానీ సరైన సమయంలో మనం ఒక చాంపియన్ టీమ్లా ఆడాం. ఓటమి కోరల్లో నుంచి బయటపడేందుకు దృడ సంకల్పంతో గోడకు కొట్టిన బంతిలా తిరిగి ఫుంజుకున్నాం. ఇది గొప్ప విజయం.. వెల్డన్ బాయ్స్. ఒక దశలో ఒత్తిడి లోనైన నేను మ్యాచ్ ఎటుపోతుందో అర్థం చేసుకోలేకపోయా. కానీ ఈ విజయం మనకు ఇంకో పది మ్యాచ్ల వరకు మంచి బూస్టప్ ఇస్తుంది. ఇక ఒత్తిడిని తట్టుకుంటూ చహర్ అద్బుత ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి భువనేశ్వర్ సహకరించిన తీరు కూడా బాగుంది. దీనిని ఇలాగే కంటిన్యూ చేద్దాం' అని అన్నాడు.
మ్యాచ్ జరుగుతున్న సమయంలో టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కాస్త ఆందోళన చెందినట్టు కనిపించింది. వెంటనే డ్రస్సింగ్ రూమ్ నుంచి డగౌట్కు చేరుకున్నాడు. బ్యాటింగ్ చేస్తున్న దీపక్ చహర్కు తమ్ముడు రాహుల్ చహర్తో సందేశం పంపించాడు. అప్పటికే 3 వికెట్లు తీసిన లెగ్స్పిన్నర్ హసరంగ ప్రమాదకరంగా బౌలింగ్ చేస్తున్నాడు. దాంతో అతడి బౌలింగ్లో షాట్లు ఆడొద్దని ద్రవిడ్ సూచించాడు. 47వ ఓవర్లో దీపక్కు తిమ్మిర్లు రావడంతో ఫిజియోతో పాటు రాహుల్ చహర్ అక్కడికి చేరుకొన్నాడు. ద్రవిడ్ సందేశాన్ని తన సోదరుడికి అందించాడు. ఆ తర్వాత హసరంగ వేసిన రెండు ఓవర్లలో భారత్ షాట్లు ఆడలేదు. మిగతా వారి బౌలింగ్లో పరుగులు రాబట్టి విజయం సాధించింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 275 పరుగులు చేసింది. చరిత అసలంక (65), అవిష్క ఫెర్నాండో (50) అర్ధ శతకాలతో ఆకట్టుకోగా.. చమిక కరుణరత్నె (44 నాటౌట్), భానుక రాజపక్స (36), ధనంజయ డిసిల్వా (32) రాణించారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యుజ్వేంద్ర చహల్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో భారత్ 49.1 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 277 పరుగులు చేసి నెగ్గింది. 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' దీపక్ చహర్ (82 బంతుల్లో 69 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ (44 బంతుల్లో 53; 6 ఫోర్లు) అర్ధ సెంచరీతో రాణించాడు. బౌలింగ్లో రెండు వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్లో అసమాన పోరాటం కనబర్చిన దీపక్ చహర్కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో వన్డే శుక్రవారం ఇక్కడే జరుగనుంది.