India vs Sri Lanka: శ్రేయస్ అయ్యర్ విధ్వంసం.. రెండో సెషన్లో పరుగుల వరద.. టీమిండియా ఆలౌట్

బెంగళూరు: ధనాధన్ ఇన్నింగ్స్తో పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దుమ్ములేపాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమైన చోటు జట్టును ఆదుకోవడమే కాకుండా భారీ ఇన్నింగ్స్ ఆడి టీమిండియాను మంచి స్థితిలో నిలబెట్టాడు. ఇతరుల నుంచి మద్దతు లేకపోయినప్పటికీ వన్డే తరహాలో బ్యాటింగ్ చేసిన అయ్యర్ వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అతను ఎదుర్కొన్న 98 బంతుల్లోనే 10 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయంటేనే అయ్యర్ విధ్వంసం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. శ్రేయస్ దూకుడుతో 30 ఓవర్లపాటు సాగిన రెండో సెషన్లో 6 వికెట్లు కోల్పోయినప్పటికీ టీమిండియా ఏకంగా 5కు పైగా రన్రేట్తో 159 పరుగులు రాబట్టింది. ఈ సెషన్లో పరుగుల వరద పారిందనే చెప్పుకోవాలి.

తొలి సెషన్లో లంక అధిపత్యం
టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఆరంభంలోనే తడబడింది. 29 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ (15), మయాంక్ అగర్వాల్ (4) మరోసారి నిరాశపరిచారు. ఆ తర్వాత హనుమ విహారీ, విరాట్ కోహ్లీ కాసేపు ఆడారు. జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ జయ విక్రమ బౌలింగ్లో హనుమ విహారీ (31), డిసిల్వా బౌలింగ్లో విరాట్ కోహ్లీ (23) స్వల్ప వ్యవధిలో వెనుదిరిగారు. దీంతో లంచ్ బ్రేక్ సమయానికి టీమిండియా 4 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. 29 ఓవర్లపాటు సాగిన తొలి సెషన్లో శ్రీలంక బౌలర్లే అధిపత్యం చెలాయించారు.

ఆదుకున్న శ్రేయస్ అయ్యర్
లంచ్ అనంతరం ప్రారంభమైన సెకండ్ సెషన్లో టీమిండియాను శ్రేయస్ అయ్యర్ ఆదుకున్నాడు. మిగతా వారెవరూ సహకరించకపోయినప్పటికీ వరుస బౌండరీలతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే అయ్యర్కు తోడుగా దూకుడుగా ఆడిన పంత్ 26 బంతుల్లోనే 39 పరుగులు చేసిన ఎంబుల్డేనియా బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయ్యాడు. పంత్ ఔటయ్యాక బ్యాటింగ్ బాధ్యత అంతా తన భుజాన వేసుకోని శ్రేయస్ అయ్యర్ ఆడాడు. ఈ క్రమంలో 54 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడమే కాకుండా టీమిండియాను ఆదుకున్నాడు.

అయ్యర్ ఒంటరి పోరాటం
జడేజా (4), అశ్విన్ (13), అక్షర్ పటేల్ (9), మహ్మద్ షమీ (5) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. అయినా శ్రేయస్ అయ్యర్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఓ వైపు వికెట్లు పడుతున్న మరోవైపు సునాయసంగా పరుగులు రాబట్టడం గమనార్హం. ఈ క్రమంలో జట్టు స్కోర్ను అయ్యర్ 200 దాటించాడు. పంత్తో కలిసి 40 పరుగులు, జడేజాతో కలిసి 22 పరుగులు, అశ్విన్తో కలిసి 35 పరుగులు, అక్షర్ పటేల్తో కలిసి 32 పరుగులు, షమీతో కలిసి 14 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

సెంచరీ మిస్
ఓ దశలో శ్రేయస్ అయ్యర్ సెంచరీ చేయడం ఖాయంగానే కనిపించింది. కానీ వికెట్లు లేకపోవడంతో ముందుకొచ్చి భారీ షాట్కు ప్రయత్నించిన అయ్యర్ బాల్ మిస్సవడంతో స్టంపౌట్ అయ్యాడు. ఈ క్రమంలో సెంచరీ చేసే అవకాశాన్ని కూడా కోల్పోయాడు. మొత్తంగా 98 బంతులు ఎదుర్కొన్న శ్రేయస్ అయ్యర్ 10 ఫోర్లు, 4 సిక్సులతో 92 పరుగులు చేశాడు. అయ్యర్ ఔట్తో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 252 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో భారత ఆటగాళ్లు 59 ఓవర్లు బ్యాటింగ్ చేశారు. శ్రీలంక బౌలర్లలో ఎంబుల్దేనియా, జయవిక్రమ మూడేసి వికెట్లు, డిసిల్వా 2, లక్మల్ ఒక వికెట్ తీశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications