1979లో తొలిసారి
భారత్-శ్రీలంక జట్లు తొలిసారి 1979 ప్రపంచకప్లో తలపడ్డాయి. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 60 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ 191 పరుగులకే కుప్పకూలింది. దీంతో ప్రపంచకప్లో శ్రీలంక టీమిండియా తొలి విజయాన్ని నమోదు చేసింది.
1992లో వర్షం కారణంగా రద్దు
భారత్-శ్రీలంక జట్లు మళ్లీ రెండోసారి 1992 ప్రపంచకప్లో తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లంక ఫీల్డింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ప్రారంభమైన రెండు బంతులకే ఏకధాటిగా వర్షం పడడంతో అంఫైర్లు మ్యాచ్ రద్దు చేశారు.
1996 ఈడెన్లో ఉద్రిక్తత
సొంతగడ్డపై జరిగిన ఈ ప్రపంచకప్లో టీమిండియా సెమీస్ నుంచి అనూహ్యంగా నిష్క్రమించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండు జట్లూ మూడోసారి తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన లంక ఎనిమిది వికెట్లకు 251 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో సచిన్(65) ధాటిగా ఆరంభించడంతో టీమిండియా సునాయాసంగా గెలుస్తుందని అంతా భావించారు. అయితే, సచిన్ టెండూల్కర్ ఔటైన తర్వాత వరుసగా టీమిండియా ఆరు వికెట్లు కోల్పోయింది. దీంతో ఓటమిని తట్టుకోలోనే భారత అభిమానులు స్టేడియంలోకి నీళ్ల బాటిళ్లు విసిరి ఆందోళన చేయడంతో పాటు స్టాండ్స్లోని కుర్చీలకు సైతం నిప్పంటించారు. దీంతో మ్యాచ్ ఎంతకీ జరగ్గపోవడంతో మ్యాచ్ రిఫరీ శ్రీలంకను విజేతగా ప్రకటించాడు.
1999లోలంకపై తొలి విజయం
1999 ప్రపంచకప్లో శ్రీలంకపై భారత్ తొలిసారి విజయం సాధించింది. ఈ మ్యాచ్లో సౌరవ్ గంగూలీ(183), రాహుల్ ద్రవిడ్(145) సెంచరీలతో చెలరేగడంతో టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 373 పరుగులు చేసింది. అనంతరం 374 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దోగిన శ్రీలంక స్వల్ప స్కోరుకే ఆలౌటైంది. దీంతో 157 పరుగుల తేడాతో విజయం సాధించింది.
2003లో అతిపెద్ద విజయం
2003 ప్రపంచకప్లో భారత్ 183 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్లో సచిన్ టెండూల్కర్(97) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 292 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంకను భారత బౌలర్లు 109 పరుగులకే ఆలౌట్ చేశారు.
2007లో విజయం సాధించిన శ్రీలంక
1999, 2003 ప్రపంచకప్లలో చిత్తుగా ఓడిన శ్రీలంక 2007 ప్రపంచకప్లో దానికి బదులు తీర్చుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 254 పరుగులు చేసింది. అనంతరం టీమిండియాను 185 పరుగులకే ఆలౌట్ చేయడంతో శ్రీలంక 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
2011లో లంకపై భారత్ విజయం
ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో జయవర్ధనే 103 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాని గంభీర్(97), ధోనీ(91) హాఫ్ సెంచరీలతో రాణించడంతో టీమిండియా విజయం సాధించింది.
2015 ప్రపంచకప్లో ఇలా!
ఆస్ట్రేలియా ఆతిథ్యమిచ్చిన 2015 ప్రపంచకప్లో ఇరు జట్లూ వేర్వేరు గ్రూపుల్లో ఉండడంతో తలపడలేదు. ప్రస్తుతం ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ రౌండ్రాబిన్ పద్ధతిలో జరుగుతుండటంతో ఆఖరి లీగ్ మ్యాచ్లో ఇరు జట్లు తలపడుతున్నాయి. టీమిండియా ఇప్పటికే సెమీస్కు చేరడంతో కోహ్లీసేనకు ఇది నామమాత్రపు మ్యాచే. అయితే, ఈ మ్యాచ్లో గెలిస్తే పాయింట్లు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు లీగ్ స్టేజిలో ఆడనున్న ఆఖరి మ్యాచ్లోనైనా విజయం సాధించి టోర్నీని ఘనంగా ముగించాలని లంకేయులు భావిస్తున్నారు.