
హైదరాబాద్: విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 216 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ (100 నాటౌట్; 85 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సులు)తో రాణించడంతో 32.1 ఓవర్లకే లక్ష్యాన్ని చేధించింది.
దీంతో మూడు వన్డేల సిరీస్ను టీమిండియా 2-1 తేడాతో గెలుచుకుంది. మరో బ్యాట్స్మన్ శ్రేయాస్ అయ్యర్ (65; 63 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సు) హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఆదిలోనే రోహిత్ శర్మ(7) వికెట్ను కోల్పోయింది.

ఆ సమయంలో శిఖర్ ధావన్కు జత కలిసిన శ్రేయాస్ అయ్యర్ దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలోనే 44 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత దూకుడుగా ఆడే క్రమంలో అయ్యర్ రెండో వికెట్గా పెవిలియన్ చేరాడు. దాంతో శిఖర్-అయ్యర్ల 135 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దినేశ్ కార్తీక్(34 నాటౌట్)-ధావన్ల జోడి మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. శ్రీలంక బౌలర్లలో ధనుంజయ, పెరీరా తలో వికెట్ తీసుకున్నారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక 44.5 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే.
భారత్ ఇన్నింగ్స్ సాగిందిలా:
శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ
విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ 51 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సు సాయంతో హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో సిక్సుతో ధావన్ హాఫ్ సెంచరీని నమోదు చేయడం విశేషం. 44 పరుగుల వద్ద అఖిల ధనంజయ వేసిన బంతిని సిక్సర్గా మలిచి హాఫ్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం 21 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టానికి 131 పరుగులు చేసింది. మూడో వన్డేలో విజయం సాధించేందుకు భారత్ ఇంకా 85 పరుగులు చేయాల్సి ఉంది.
శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీ
శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో భారత బ్యాట్స్మెన్ శ్రేయాస్ అయ్యర్కు హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అరంగేట్రం చేసిన ఈ సిరీస్లో అతడికిది వరుసగా రెండో హాఫ్ సెంచరీ కావడం విశేషం. హాఫ్ సెంచరీ సాధించే క్రమంలో అయ్యర్కు రెండు లైఫ్లు లభించాయి. పతిరన వేసిన 12వ ఓవర్ తొలి బంతిని కట్ షాట్ ఆడేందుకు శ్రేయర్ ప్రయత్నించాడు.
కానీ అది బ్యాట్ ఎడ్జ్కి తగలడంతో ఫస్ట్ స్లిప్లో ఉన్న మ్యాథ్యస్ చేతిలోకి వెళ్లిగా దానిని అతడు చేజార్చాడు. దీంతో బంతి బౌండరీ వెళ్లింది. అదే ఓవర్ చివరి బంతి శ్రేయాస్ ప్యాడ్స్కి తగలగా లంక ఆటగాళ్లు ఎల్బీగా అప్పీల్ చేశారు. కానీ దానిని అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. లంక ఆటగాళ్లు రివ్యూ కోరగా.. అక్కడ కూడా అది నాటౌట్గా తేలింది.
16 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ధావన్ (35), శ్రేయాస్ (54) పరుగులతో ఉన్నారు. మూడో వన్డేలో విజయం సాధించేందుకు భారత్ ఇంకా 113 పరుగులు చేయాల్సి ఉంది.
తొలి వికెట్ కోల్పోయిన భారత్
విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో 216 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆదిలోనే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. రెండో వన్డేలో డబుల్ సెంచరీతో మెరిసిన కెప్టెన్ రోహిత్ శర్మ (7) పరుగుల వద్ద పెవిలియన్కు చేరాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన మిస్టరీ స్పిన్నర్ అఖిల ధనంజయ వేసిన 3.2వ బంతిని భారీ సిక్సర్గా మలిచిన రోహిత్ నాలుగో బంతికి బౌల్డ్ అయ్యాడు.
దీంతో మైదానం ఒక్కసారిగా మూగబోయింది. దీంతో భారత్ జట్టు 14 పరుగుల వద్దే తొలి వికెట్ని చేజార్చుకుంది. రోహిత్ శర్మ ఔటైన తర్వాత క్రీజులోకి యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాడు. దీంతో 10 ఓవర్లకు గాను భారత్ వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. ప్రస్తుతం ధావన్ (27), శ్రేయస్ అయ్యర్ (14) పరుగులతో క్రీజులో ఉన్నారు.

శ్రీలంక ఇన్నింగ్స్ కొనసాగిందిలా:
మూడు వన్డేల సిరిస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డేలో భారత బౌలర్లు సత్తా చాటారు. విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో ఆదివారం జరుగుతున్న చివరి వన్డేలో భారత్ బౌలర్లు చాహల్ (3/46), కుల్దీప్ యాదవ్ (3/42), హార్దిక్ పాండ్యా (2/49) అద్భుత ప్రదర్శన చేయడంతో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక జట్టు 44.5 ఓవర్లలో 215 పరుగులకే ఆలౌటైంది.
దీంతో భారత్కు 216 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక బ్యాట్స్ మెన్లలో ఓపెనర్ ఉపుల్ తరంగ (95) మెరుపు ఇన్నింగ్స్తో ఆ జట్టుకి శుభారంభనిచ్చినా మిడిలార్డర్ పరుగుల రాబట్టడంలో విఫలమైంది. సమరవిక్రమ (42), మాథ్యూస్ (17), డిక్వెల్లా (8), కెప్టెన్ తిసార పెరీరా (6) కీలక సమయంలో వికెట్లు చేజార్చుకున్నారు.
ఆరో వికెట్ కోల్పోయిన శ్రీలంక
విశాఖ వేదికగా భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక ఆరో వికెట్ కోల్పోయింది. జట్టు స్కోరు 197 పరుగుల వద్ద తిసారా పెరీరా(6) చాహల్ బౌలింగ్ ఎల్బీగా వెనుదిరిగాడు. 136 పరుగుల వద్ద 2 వికెట్లు కోల్పోయి పటిష్ట స్థితిలో ఉన్న శ్రీలంక వరుసగా రెండు వికెట్లు చేజార్చుకుంది. దీంతో శ్రీలంక 61 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లు కోల్పోయింది.చాహల్ మూడు వికెట్లు తీశాడు. 33.5వ బంతికి ఏంజెలో మాథ్యూస్ (17) క్లీన్బౌల్డ్ చేశాడు. 35.1వ బంతికి కెప్టెన్ పెరీరా (6) నేరుగా చాహల్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో 37 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక 6 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసింది. భారత బౌలర్లలో యజువేంద్ర చాహల్ 3 వికెట్లతో చెలరేగగా కుల్దీప్ రెండు వికెట్లు, బుమ్రా ఓ వికెట్ తీశారు. ప్రస్తుతం గుణరత్నె (10), సచిత్ పతిరన (6) క్రీజులో ఉన్నారు.
ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయిన శ్రీలంక
విశాఖ వేదికగా భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ 27.1 ఓవర్ తొలి బంతికి ఉపుల్ తరంగా (95) కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరగా.. అదే ఓవర్ ఐదో బంతికి నిరోషాన్ డిక్వెల్లా (8) పరుగుల వద్ద శ్రేయాస్ అయ్యర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఉపుల్ తరంగా తృటిలో సెంచరీని మిస్సయ్యాడు. ప్రస్తుతం 29 ఓవర్లకు గాను శ్రీలంక 4 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసింది. మాథ్యూస్ (7), గుణరత్నే (1) పరుగుతో క్రీజులో ఉన్నారు.

రెండో వికెట్ కోల్పోయిన శ్రీలంక
విశాఖ వేదికగా భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. చాహల్ బౌలింగ్లో సమరవిక్రమ (42) పరుగుల వద్ద శిఖర్ ధావన్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. దీంతో దాదాపు 19 ఓవర్ల తర్వాత భారత్ రెండో వికెట్ తీసింది. రెండో వికెట్కి సమరవిక్రమ, ఉపుల్ తరంగా నమోదు 121 పరుగుల భాగస్వామ్యానికి ఎట్టకేలకు తెరపడింది. సమరవిక్రమ ఔటైన తర్వాత ఏంజెలో మాథ్యూస్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం 23ఓవర్లకు గాను శ్రీలంక 2 వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. ఉపల్ తరంగా (79), మాథ్యూస్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నారు.
వికెట్ కోసం బౌలర్ల ఎదురుచూపులు
శ్రీలంకతో జరుగుతున్న చివరి వన్డేలో టీమిండియా రెండో వికెట్ కోసం ఎదురుచూస్తోంది. 16 ఓవర్ల నుంచి వికెట్ తీసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అయినా సరే వికెట్ దక్కడం లేదు. శ్రీలంక ఆటగాడు ఉపుల్ తరంగ (74) దూకుడుగా ఆడుతున్నాడు. మరోవైపు సమరవిక్రమ (33) హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. వీరిద్దరి భాగస్వామ్యం 107కు చేరుకుంది. 20 ఓవర్లు ముగిసే సరికి శ్రీలంక వికెట్ నష్టానికి 122 పరుగులు చేసింది.

10 ఓవర్లకు శ్రీలంక 68/1
విశాఖ వేదికగా భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక ఓపెనర్ ఉపుల్ తరంగా దూకుడుగా ఆడుతున్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన శ్రీలంక 10 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో తరంగా 49, సమరవిక్రమ(6) పరుగులతో ఉన్నారు. పవర్ ప్లేలో తరంగా బౌండరీల వర్షం కురిపించాడు. హార్థిక్ పాండ్యా వేసిన తొమ్మిదో ఓవర్లో తొలి ఐదు బంతులను బౌండరీకి తరలించి ఒకే ఓవర్లో 20 పరుగులు రాబట్టాడు. అంతకముందు గుణతిలక 12 బంతుల్లో 2 ఫోర్లు బాది 13 పరుగులు చేసి ఔటయ్యాడు.
తొలి వికెట్ కోల్పోయిన లంక
విశాఖ వేదికగా భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో శ్రీలంక బ్యాటింగ్ ఆరంభించింది. ఉపుల్ తరంగ, గుణతిలక ఇన్నింగ్స్ ఆరంభించారు. బ్యాటింగ్ ప్రారంభించిన కొంత సమయంలోనే లంక తొలి వికెట్ను కోల్పోయింది. దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనర్ గుణతిలక బుమ్రా వేసిన మూడో ఓవర్ నాలుగో బంతిని మిడ్ ఆన్ మీదుగా భారీ షాట్ అడేందుకు ప్రయత్నించాడు.
ఈ క్రమంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో శ్రీలంక 4 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి 19 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో తరంగా(2), సమరవిక్రమ(4) పరుగులతో ఉన్నారు.

మూడు వన్డేల సిరీస్ ఫలితాన్ని తేల్చే విశాఖపట్నం వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరిస్లో ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలవడంతో 1-1తో సమంగా ఉన్నాయి. దీంతో నిర్ణయాత్మక మూడో వన్డేలో గెలిచి సిరీస్ను సొంతం చేసుకోవాలని బరిలోకి దిగుతున్నాయి.
రాత్రి పూట మంచు కురిసే అవకాశం ఎక్కువగా ఉండటంతో బౌలింగ్ చేయడం కష్టమవుతుందన్న ఉద్దేశంతో మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు. ఈ కీలకమైన మ్యాచ్ కావడంతో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది.
వాషింగ్టన్ సుందర్ అనారోగ్యం కారణంగా ప్రీ-మ్యాచ్ సెషన్కు హాజరు కాలేదు. వాషింగ్టన్ సుందర్ స్థానంలో కుల్దీప్ యాదవ్ టీమ్లోకి వచ్చాడు. ఇక, శ్రీలంక జట్టులో స్వల్ప మార్పు జరిగింది. తిరిమనె స్థానంలో సమరవిక్రమకు తుది జట్టులో చోటు కల్పించారు. విశాఖపట్నంలో టీమిండియాకు మెరుగైన రికార్డు ఉండటంతో భారత్ విజయం సాధిస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, శ్రేయస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, మనీశ్ పాండే, ధోని, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్, బుమ్రా, చహల్, కుల్దీప్
శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్), గుణతిలక, తరంగా, సమరవిక్రమ, మాథ్యూస్, డిక్వెలా, గుణరత్నే, సచిత్, లక్మల్, అకిల ధనంజయ