
పుణె: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య పుణె వేదికగా ఆదివారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత ఆటగాళ్లు సమిష్టిగా రాణించి రెండో టెస్టును సునాయాసంగా గెలిచి.. టెస్ట్ సిరీస్ను మరో మ్యాచ్ ఉండగానే 2-0తో సొంతం చేసుకున్నారు. ఈ సిరీస్ విజయంతో టీమిండియా స్వదేశంలో వరుసగా 11 టెస్టు సిరీస్లను గెలిచి చరిత్ర సృష్టించింది. ఇక సుదీర్ఘ విరామం తర్వాత టెస్టులో పునరాగమనం చేసిన భారత సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ఈ టెస్టు సిరీస్లో నిరూపించుకున్నాడు.
గత ఏడాది జనవరిలో గాయం కారణంగా భారత్ జట్టుకి సాహా దూరమయ్యాడు. టెస్టుల్లో అతని స్థానంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ అవకాశం దక్కించుకున్నాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనలో సెంచరీలతో సత్తా చాటాడు. ఆ తర్వాత పంత్ పరుగులు చేయలేక ఇబ్బందిపడ్డాడు. ఇక కీపింగ్లోనూ పూర్తిగా నిరాశపరిచాడు. కొన్ని అవకాశాలు ఇచ్చినా.. పంత్ దాన్ని ఉపయోగించుకోలేదు. దాంతో దక్షిణాఫ్రికాతో సిరీస్కు పంత్ను తప్పించి సాహాకు అవకాశం ఇచ్చారు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుని స్టార్ అయ్యాడు.
ఈ సిరీస్లో ఆడిన రెండు టెస్టుల్లో పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాని సాహా.. కీపింగ్లోనూ మాత్రం అదుర్స్ అనిపించాడు. వికెట్ల వెనుక అత్యంత చురుగ్గా కదులుతూ అద్భుతమైన క్యాచ్లు పట్టాడు. రెండో టెస్టులో డిబ్రుయిన్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ ఇచ్చిన కష్టమైన క్యాచ్లను అందుకున్నాడు. ఇక డుప్లెసిస్ ఇచ్చిన క్యాచ్ను పట్టి ఔరా అనిపించాడు. బంతి రెండుసార్లు చేతుల్లోంచి జారిపోయినా.. డైవ్ చేసి మరి క్యాచ్ను అందుకున్నాడు. ఈ ప్రదర్శనతో సాహా అందరి దృష్టిని ఆకర్షించాడు.
2017 నుంచి పేస్ బౌలింగ్లో సాహా వికెట్ల వెనుక అద్భుతంగా రాణిస్తున్నాడు. బంతుల్ని ఆపడమే కాకుండా.. క్యాచ్లను అందుకోవడంలో కూడా సాహా టాప్లో నిలిచాడు. ఓ నివేదిక ప్రకారం.. గత రెండేళ్లలో కనీసం 10 క్యాచ్లు పట్టిన కీపర్ల జాబితాలో సాహా 96.9 శాతం క్యాచ్ల్ని అందుకుని అగ్రస్థానంలో నిలిచాడు. శ్రీలంక కీపర్ డిక్వెల్లా 95.5 శాతంతో రెండో స్థానంలో నిలిచాడు. పంత్ 91.6 శాతంతో 9వ స్థానంలో ఉన్నాడు.
సాహా అద్భుత కీపింగ్ చేయడంతో రిషబ్ పంత్ను ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు మీమ్స్ పోస్ట్ చేశారు. ఇక పంత్ పని అయిపోయినట్టే అని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. భారత జట్టులో చోటును పంత్ ఆశించొద్దు అని మరో నెటిజన్ కామెంట్ చేసాడు. కీపర్గా సాహా అదుర్స్.. పంత్కు జట్టులో చోటెక్కడ? అని ఓ అభిమాని ప్రశ్నించాడు. అంతేకాదు రకరకాల ఫొటోలతో పంత్ను ట్రోల్ చేస్తున్నారు.