ప్రతీకారం కోసం ఆరాటం
సఫారీల చేతిలో టెస్టు సిరీస్లో 1-2తో ఓటమి పాలైన భారత్.. ఈ వన్డే సిరీస్లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. టెస్టు సిరీస్లో చేసిన పోరపాట్లు వన్డే సిరీస్లో పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యంగా టెస్టు సిరీస్లో బౌలర్లు రాణించినప్పటికీ బ్యాటర్లు రాణించలేకపోయారు.
దీంతో టీమిండియా బ్యాటింగ్పైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. బ్యాటర్లు అంతా కలిసి కట్టుగా రాణించాలని భావిస్తున్నారు. ఇక బౌలర్లు కూడా సత్తా చాటితే సిరీస్ గెలవడం పెద్దగా కష్టమేమి కాదని టీమ్ మేనేజ్ భావిస్తోంది. కాగా సౌతాఫ్రికాలో భారత్ చివరి సారి పర్యటించినప్పుడు వన్డే సిరీస్ను టీమిండియానే గెలిచింది. దీంతో ప్రస్తుతం సిరీస్ను నిలబెట్టు కోవాలని భారత్ పట్టుదలగా ఉంది.
కళ్లన్నీ కోహ్లీపైనే
ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కెప్టెన్గా కాకుండా టీంలో సాధారణ ప్లేయర్గా ఆడుతుండడంతో ఈ మ్యాచ్లో అందరి చూపు విరాట్ కోహ్లీపైనే ఉంది. దీనికి తోడు కొంత కాలంగా సరైన ఫాంలో కూడా లేకపోవడంతో కోహ్లీ ఎలా ఆడతాడనే దానిపై అందరి కళ్లు ఉన్నాయి. కెప్టెన్గా ఉండడం వల్ల బ్యాటింగ్లో రాణించలేక పోతున్నాని కోహ్లీ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో కోహ్లీ ఇక మళ్లీ తన పాత ఫాంలోకి వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
రాహుల్కు తొలి పరీక్ష
మరో వైపు ఈ సిరీస్లో కెప్టెన్సీ చేపట్టనున్న కేఎల్ రాహుల్ నాయకుడిగా తొలి సవాల్ను ఎదుర్కొబోతున్నాడు. ఇప్పటికే ఈ పర్యటనలోనే ఓ టెస్టు మ్యాచ్కు కెప్టెన్సీ చేసిన రాహుల్ ఇప్పుడు సిరీస్ మొత్తానికే చేయబోతున్నాడు. టెస్టు కెప్టెన్సీ రేసులో రాహుల్ పేరు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో నాయకుడిగా రాహుల్ ఈ సిరీస్లో సత్తా చాటాల్సిన అవసరం ఉంది.
పిచ్
తొలి వన్డే మ్యాచ్ జరగనున్న పార్ల్లోని బోలాండ్ మైదానం బౌండరీ లైన్ చిన్నదిగా ఉంది. దీంతో మ్యాచ్లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. పిచ్ స్పిన్నర్లకు కూడా అనుకూలించనుంది. అలాగే వర్షం నుంచి ఎలాంటి ముప్పు లేదు. దీంతో మ్యాచ్ సజావుగా సాగనుంది.
తుది జట్లు (అంచనా)
భారత్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), ధవన్, కోహ్లీ, సూర్యకుమార్, పంత్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, భువనేశ్వర్, అశ్విన్, బుమ్రా, చాహల్.
దక్షిణాఫ్రికా: డికాక్, జానెమన్ మలన్, బవుమా (కెప్టెన్), మార్క్రమ్, డుస్సెన్, మిల్లర్, ప్రిటోరియస్, ఫెలుక్వాయో, జాన్సెన్, ఎన్గిడి, షంసి.