సీనియర్ ఆటగాళ్లు రీఎంట్రీ:
గాయాలతో జట్టుకి దూరమైన సీనియర్ ఆటగాళ్లు దక్షిణాఫ్రికా సిరీస్తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో సీనియర్ క్రికెటర్లకి అవకాశం ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ కూడా నిర్ణయించినట్లు సమాచారం. దీంతో గాయాల నుండి కోలుకున్న శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్ తుది జట్టులో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ ముగ్గరిని ఆడించాలనుకుంటున్నట్టు తెలుస్తోంది.
గబ్బర్కు జతగా పృథ్వీ:
తొడ కండరాలు పట్టేయడంతో రెగ్యులర్ ఓపెనర్ రోహిత్ శర్మ జట్టుకు దూరమయిన నేపథ్యంలో శిఖర్ ధావన్ ఓపెనింగ్ చేయనున్నాడు. ప్రస్తుతం గబ్బర్ ఫామ్లో లేడు. గతవారం ముంబైలో జరిగిన డీవై పాటిల్ టీ20 కప్లో చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. అయినా రోహిత్ లేకపోవడంతో గబ్బర్కు చోటు దక్కనుంది. గబ్బర్కు జతగా పృథ్వీ షా రానున్నాడు. న్యూజిలాండ్ పర్యటనలో విఫలమయినా.. షాకు మరో ఛాన్స్ దక్కనుంది.
కోహ్లీ ఫామ్ అందుకునేనా?:
ఇక మూడులో కెప్టెన్ విరాట్ కోహ్లీ వస్తాడు. అయితే కోహ్లీ ఫామ్లో లేకపోవడం జట్టును కలవరపెడుతోంది. న్యూజిలాండ్ పర్యటనలో కెప్టెన్ విఫలమైన సంగతి తెలిసిందే. కివీస్ గడ్డపై కేవలం ఒకే హాఫ్ సెంచరీతో పర్యటనను ముగించడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే స్వదేశంలో జరగనున్న దక్షిణాఫ్రికా సిరీస్లో చెలరేగి తిరిగి ఫామ్లోకి వస్తాడని అతడి అభిమానులు ఆశిస్తున్నారు.
బెంచ్కే పంత్:
నెం.4లో యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ వస్తాడు. న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్లో జరిగిన తప్పిదాలను శ్రేయాస్ సరిదిద్దుకునేందుకు ఇదే సరైన అవకాశం. కేఎల్ రాహుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉన్నవాడు. అయితే ప్రస్తుతం నెం.5లో ఆడుతున్నాడు. కీపర్ పాత్రలోనూ సెట్ అయ్యాడు. దీంతో రిషబ్ పంత్ బెంచ్కే పరిమిరితమవ్వనున్నాడు.
ఆల్రౌండర్లుగా పాండ్యా, జడేజా:
డీవై పాటిల్ టీ20 కప్లో సెంచరీలు బాదిన హార్దిక్ పాండ్యా తుది జట్టులో ఉండనున్నాడు. దాదాపు ఏడు నెలలు క్రికెట్కి దూరంగా ఉన్నా.. తన పవర్ హిట్టింగ్లో జోరు ఏమాత్రం తగ్గలేదని ఇటీవలే నిరూపించుకున్నాడు. ఇక రవీంద్ర జడేజా కొనసాగనున్నాడు. 6,7 స్థానాల్లో ఈ ఇద్దరు ఆల్రౌండర్లు బరిలోకి దిగనున్నారు. అయితే మనీష్ పాండే కూడా అవకాశం కోసం చూస్తున్నాడు. స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ అవసరమనుకుంటే.. తప్ప మనోడికి చోటు దక్కకపోవచ్చు.
భువనేశ్వర్ రీఎంట్రీ:
గాయంతో న్యూజిలాండ్తో సిరీస్కి దూరమైన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. జస్ప్రీత్ బుమ్రా కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. 140-150కిమీ వేగంతో యార్కర్లు సంధించే నవదీప్ సైనీకి తొలి వన్డేలో అవకాశం దాదాపు ఖాయం. జడేజా ఉంటాడు కాబట్టి యుజువేంద్ర చాహల్కి తుది జట్టులో చోటు దక్కనుంది. దీంతో మరో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రిజర్వ్ బెంచ్కి పరిమితం కానున్నాడు.
తుది జట్టు (అంచనా):
శిఖర్ ధావన్, పృథ్వీ షా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, యుజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, నవదీప్ సైనీ.