తొలి డబుల్ సెంచరీ:
రోహిత్ శర్మ ఈ సిరీస్లోనే టెస్టుల్లో ఓపెనర్గా మారిన విషయం తెలిసిందే. విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో రోహిత్ (176, 127) రెండు ఇన్నింగ్స్ల్లోనూ శతకాలు చేసాడు. ఆ మ్యాచ్లో టీమిండియా 203 పరుగులతో విజయం సాధించింది. ఇక రెండో టెస్టులో 14 పరుగులే చేసాడు. అయినా భారత్ ఇన్నింగ్స్ 137 పరుగులతో గెలుపొందింది. మూడో మ్యాచ్లో ఏకంగా ద్విశతకం చేయడం విశేషం. పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎవరికీ సాధ్యంకాని విధంగా రోహిత్ మూడు సార్లు (264, 209, 208నాటౌట్) డబుల్ సెంచరీలు చేసాడు.
నాలుగో వికెట్కు 267 పరుగులు:
ఓవర్నైట్ స్కోర్ 224/3తో రెండో రోజు ఆటను కొనసాగించిన రోహిత్, వైస్కెప్టెన్ అజింక్య రహానే (115; 192 బంతుల్లో 17x4, 1x6) ధాటిగా ఆడారు. తొలిరోజు మెరుపులు మెరిపించిన రోహిత్, రహానే జంట మొదటి సెషన్లోనూ వేగంగా పరుగులు చేశారు. ఈ క్రమంలో రోహిత్ 199 బంతుల్లో 150 పరుగులు చేస్తే.. రహానే 172 బంతుల్లో 100 పరుగులు చేశాడు. ఈ జోడి నాలుగో వికెట్కు 267 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు.
భారీ స్కోర్ దిశగా భారత్:
భారత స్కోర్ 300 దాటాక రహానే ఔటయ్యాడు. లిండే బౌలింగ్లో రహానే.. క్లాసెన్ చేతికి చిక్కాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా హిట్మ్యాన్కు అండగా నిలిచాడు. దీంతో లంచ్ విరామానికి భారత్ 357/4తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. లంచ్ అనంతరం రోహిత్ డబుల్ సెంచరీ చేసి పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో సాహా (6), జడేజా (17) ఉన్నారు. భారత్ 92 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 378 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు భారీ స్కోర్ దిశగా కొనసాగుతోంది.
తొలి రోజు 224 పరుగులు:
తొలి రెండు టెస్టుల తరహాలోనే మూడో మ్యాచ్లోనూ తొలి రోజు భారత్ పట్టు నిలబెట్టుకుంది. శనివారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో భారత్ 58 ఓవర్లలో 3 వికెట్లకు 224 పరుగులు చేసింది. వర్షం, వెలుతురు లేమి కారణంగా టీ విరామం తర్వాత కొద్ది సేపటికే అంపైర్లు ఆటను నిలిపివేశారు. దాంతో మరో 32 ఓవర్ల ఆటను కోల్పోవాల్సి వచ్చింది. మయాంక్ అగర్వాల్ (10), పుజారా (0), విరాట్ కోహ్లీ (12) తక్కువ పరుగులకే వెనుదిరిగారు.