కేప్టౌన్లో 3వ టీ20: సఫారీ గడ్డపై విజయంతో ముగిస్తారా?


హైదరాబాద్: సఫారీ గడ్డపై కోహ్లీసేన పర్యటన తుది దశకు చేరుకుంది. మూడు టీ20ల సిరిస్లో చివరిదైన ఆఖరి టీ20తో సఫారీ గడ్డపై టీమిండియా తన పర్యటనను ముగించనుంది. ఇరు జట్ల మధ్య మూడో టీ20 కేప్టౌన్ వేదికగా శనివారం రాత్రి 9.30 గంటలకు జరగనుంది. గత బుధవారం జరిగిన రెండో టీ20లో ఆతిథ్య దక్షిణాఫ్రికా విజయం సాధించడంతో మూడు టీ20 సిరిస్ 1-1తో సమం అయింది.
ఈ టోర్నీ విజేత ఎవరో తేల్చే మ్యాచ్ ఆఖరి మ్యాచా కావడంతో సిరిస్ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్ గెలిస్తే కోహ్లీసేన దక్షిణాఫ్రికా గడ్డపై రెండు సిరీస్ గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించనుంది. స్వదేశంలో వరుస విజయాలను నమోదు చేసి భారీ అంచనాల మధ్య సఫారీ గడ్డపై భారత జట్టు గతేడాది డిసెంబర్లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. తొలుత జరిగిన మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్ను నెగ్గి సరికొత్త చరిత్రను సృష్టిస్తుందని అంతా భావించారు.

అంచనాలు అందుకోవడంలో కోహ్లీసేన విఫలం
అయితే, అభిమానుల అంచనాలను అందుకోవడంలో కోహ్లీసేన విఫలమైంది. తొలి రెండు టెస్టుల్లో ఓటమి పాలై మూడో టెస్టులో విజయం సాధించింది. దీంతో మూడు టెస్టుల సిరీస్ని 1-2తో చేజార్చుకుంది. చివరి టెస్టులో నెగ్గిన అత్మవిశ్వాసంతో ఆరు వన్డేల సిరిస్ను ఏకంగా 5-1తో చేజిక్కించుకుని సఫారీ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించింది.

సొంతగడ్డపై విజయంతో సిరీస్ని ముగించాలని
ఇక, శనివారం జరిగే మూడో టీ20లో కూడా గెలిచి సఫారీ గడ్డపై విజయంతో ముగించాలని కోహ్లీసేన ఊవిళ్లూరుతుండగా... వన్డే సిరిస్లో ఎదురైన ఘోర పరాభవానికి టీ20 సిరిస్లో బదులు తీర్చుకోవాలని ఆతిథ్య దక్షిణాఫ్రికా వ్యూహాం రచిస్తోంది. అంతేకాదు సొంతగడ్డపై విజయంతో సిరీస్ని ముగించాలని ఆశిస్తోంది.

భారత జట్టుకు ఇదే తొలి టీ20
మూడో టీ20 జరిగే కేప్టౌన్లోని న్యూలాండ్స్ స్టేడియంలో టీమిండియా ఇప్పటివరకు ఒక్క టీ20 కూడా ఆడలేదు. మరోవైపు ఈ స్టేడియంలో ఆతిథ్య జట్టుకు టీ20ల్లో పేవలమైన రికార్డు ఉండటం కోహ్లీసేనకు కలిసొచ్చే అంశం. ఈ స్టేడియంలో దక్షిణాఫ్రికా ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ల్లో ఐదింటిలో ఓటమిపాలైంది.

ఆత్మవిశ్వాసంతో మూడో టీ20లో సఫారీలు
గెలిచిన మూడు మ్యాచ్ల వివరాలు ఇలా ఉన్నాయి. 2007లో జరిగిన ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నీలో రెండు మ్యాచ్లు నెగ్గగా, ఆ తర్వాత ఇంగ్లాండ్తో 2016లో జరిగిన ద్వైపాక్షిక సిరిస్లో విజయం సాధించింది. అయితే రెండో టీ20లో కోహ్లీసేనపై సఫారీలు విజయం సాధించడం ఆ జట్టులో ఆత్మవిశ్వాసాన్ని నింపింది.

స్వల్ప మార్పులతో బరిలోకి కోహ్లీసేన
స్పిన్నర్ చాహల్ బౌలింగ్లో భారీగా పరుగులు రాబట్టి రెండో టీ20లో సఫారీలను ఒంటిచేత్తో గెలిపించిన క్లాసెన్పై ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది. ఇక, మూడో టీ20లో గెలుపు కోసం భారత జట్టులో స్వల్ప మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. రెండో టీ20లో గాయం కారణంగా దూరమైన బుమ్రా మూడో టీ20లో తిరిగి చోటు దక్కించే అవకాశం ఉంది.

జట్ల వివరాలు:
భారత్: కోహ్లీ (కెప్టెన్), ధావన్, రోహిత్ శర్మ, రైనా, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, ధోని, పాండ్యా, చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, భువీ, బుమ్రా, ఉనాద్కత్, శార్దూల్ ఠాకూర్
దక్షిణాఫ్రికా: జేపీ డుమిని (కెప్టెన్), బెహార్డిన్, జూనియర్ డాలా, రెజీ హెన్రిక్స్, క్రిస్ట్రియన్, క్లాసెన్, డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్, డేన్ ప్యాటర్సన్, ఆరోన్ ఫాంగిసో, ఫెలుక్వాయో, షంసీ, జేజే స్మట్స్
మ్యాచ్ రాత్రి 9.30 గంటలకు సోనీ టీవీలో ప్రత్యక్ష ప్రసారం
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications