3-0తో కోహ్లీసేన సిరిస్ను కైవసం చేసుకుంటే
మరోవైపు ఆతిథ్య సఫారీ జట్టు మాత్రం కోహ్లీసేనకు కట్టడి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తొలి టీ20లో సఫారీ జట్టుపై కోహ్లీసేన 28 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో బౌలింగ్లో భువీ, బ్యాటింగ్లో ధావన్ చెలరేగి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం జరుగుతోన్న మూడు టీ20ల సిరీస్ను 3-0తో కోహ్లీసేన కైవసం చేసుకుంటే ర్యాంకింగ్ పరంగా భారత్ రెండో స్థానానికి చేరుకుంటుంది.
కోహ్లీ ఆడటంపై సందిగ్థత
మరోవైపు బుధవారం జరిగే ముక్కోణపు సిరీస్ ఫైనల్లో న్యూజిలాండ్ను ఆస్ట్రేలియా ఓడిస్తే మాత్రం ఎప్పటిలాగే మూడో స్థానంలోనే ఉంటుంది. రెండో టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆడటంపై సందిగ్థత నెలకొంది. తొలి టీ20లో గాయం కారణంగా దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో కోహ్లీ మైదానాన్ని విడిచిన సంగతి తెలిసిందే. దీనిపై జట్టు మేనేజ్మెంట్ అధికారిక ప్రకటన చేసే వరకు స్పష్టత లేదు.
కోహ్లీకి విశ్రాంతినిస్తే తుది జట్టులో కేఎల్ రాహుల్కు చోటు
గాయం చిన్నదే కావడంతో కోహ్లీ మ్యాచ్లో ఆడేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కోహ్లీకి విశ్రాంతినిస్తే అతడి స్థానంలో కేఎల్ రాహుల్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మనీశ్ పాండే కోసం తొలి టీ20లో తన స్థానాన్ని రాహుల్ త్యాగం చేసిన సంగతి తెలిసిందే. రెండో టీ20 జరిగే సెంచూరియన్ పిచ్ మందకొడిగా ఉండటంతో భారత్ స్పిన్ ద్వయంను ఆడించే అవకాశం ఉంది.
కనీసం టీ20 సిరీస్నైనా
వన్డే సిరిస్లో ఓటమి పాలైన ఆతిథ్య జట్టు కనీసం టీ20 సిరీస్ను దక్కించుకోవాలని భావిస్తున్నారు. ముఖ్యంగా రెండో టీ20లో సఫారీలు తీవ్ర ఒత్తిడితో బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ ప్లేయర్లు గాయాల కారణంగా జట్టుకు దూరమవడంతో జట్టు విజయాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితిలో సఫారీలు
రెండో టీ20లో సఫారీలు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి. గాయం కారణంగా స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ టీ20 సిరిస్ నుంచి తప్పుకోవడం జట్టుని ఇబ్బంది పెడుతోంది. హెన్రిక్స్, బెహార్డిన్ బ్యాటింగ్లో రాణిస్తున్నా.. ఓపెనర్ స్మట్స్, మిడిలార్డర్లో డుమిని, మిల్లర్, ఫెలుక్వాయో విఫలమవుతుండటం జట్టుని తీవ్రంగా వేధిస్తోంది.
జట్ల వివరాలు:
భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, సురేశ్ రైనా, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, ధోనీ, హార్దిక్ పాండ్య, యజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, జయదేవ్ ఉనాద్కత్, శార్దూల్ ఠాకూర్
దక్షిణాఫ్రికా: జేపీ డుమిని (కెప్టెన్), బెహార్డిన్, జూనియర్ డాలా, రెజీ హెన్రిక్స్, క్రిస్ట్రియన్, క్లాసెన్, డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్, డేన్ ప్యాటర్సన్, ఆరోన్ ఫాంగిసో, ఫెలుక్వాయో, షంసీ, జేజే స్మట్స్
మ్యాచ్ రాత్రి 9.30 గంటలకు సోనీ టీవీలో ప్రత్యక్ష ప్రసారం