భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు
ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికా జట్టు ధర్మశాల వేదికగా ఆదివారం జరగనున్న తొలి టీ20లో టీమిండియాతో తలపడనుంది. ఈ సందర్భంగా లాన్స్ క్లూసెనర్ పీటీఐతో మాట్లాడుతూ "రిషబ్ పంత్ పొరపాట్లను ఎత్తిచూపడం నాకు ఇబ్బందికరంగా అనిపిస్తోంది. అలాంటి ప్రతిభావంతుడు ఎప్పుడూ ముందుండాలి. క్రీజులో కుదురుకోవడానికి కొంత సమయం తీసుకోవాలి" అని అన్నాడు.
పంత్లో అద్భుత టాలెంట్
"తనలో ఉన్న అద్భుత టాలెంట్ను ప్రదర్శించేందుకు ఇంకా కొంతకాలం పడుతుంది. తన తప్పుల నుంచే నేర్చుకోవడం కాకుండా ఇతరుల తప్పుల నుంచి నేర్చుకొంటేనే అంతర్జాతీయ క్రికెట్లో అతడు ముందంజలో ఉంటాడు. తనవి మాత్రమే కాకుండా ఇతరుల తప్పుల నుంచి నేర్చుకొంటేనే త్వరగా మెరుగవుతారు" అని క్లూసెనర్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ లాంటి టోర్నీల్లో అద్భుత ప్రదర్శన
ఐపీఎల్ లాంటి టోర్నీల్లో అద్భుత ప్రదర్శన చేసే రిషబ్ పంత్ అంతర్జాతీయ వన్డేల్లో 22.90, టీ20ల్లో 21.57 యావరేజిగా ఉండటం గమనార్హం. అయితే, షాట్ సెలక్షన్ లోపం వల్లే రిషబ్ పంత్ ఇంత తక్కువ యావరేజిని కలిగి ఉన్నాడని క్రికెట్ విశ్లేషకుల వాదన. అయితే, టెస్టుల్లో మాత్రం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్లపై పంత్ సెంచరీలు సాధించడం విశేషం.
ధోనితో కలిసి ఆడటం పంత్ అదృష్టం
"ధోనీ కెరీర్ చివరిదశలో ఉన్న సమయంలో అతడితో కలిసి ఆడటం నిజంగా పంత్ అదృష్టం. తన సీనియర్ నుంచి అతడికి సరైన సలహాలు వస్తాయి. పంత్కు అద్భుతమైన కోచ్ల శిక్షణ లభిస్తోంది. వారు అతడి సహజ ప్రతిభను పెంచి పోషిస్తారు" అని క్లూసెనర్ తెలిపాడు. భారత పర్యటనలో భాగంగా సఫారీలు 3 టీ20లు, 3 టెస్టు మ్యాచ్ల సిరిస్ ఆడనుంది. ఈ సిరిస్ నుంచి ధోని స్వతహాగా తప్పుకోవడంతో రెగ్యులర్ వికెట్ కీపర్ బాధ్యతలను పంత్ కు అప్పగించారు.