
హైదరాబాద్: విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజైన శుక్రవారం సఫారీ బ్యాట్స్మెన్ భారత బౌలర్లకు పరీక్షగా నిలిచారు. ఓవర్నైట్ స్కోరు 39/3తో శుక్రవారం మూడో రోజు ఆట ఆరంభించిన దక్షిణాఫ్రికా జట్టుని ఇషాంత్శర్మ ఆదిలోనే దెబ్బకొట్టాడు.
బవుమా (18)ను ఎల్బీగా పెవిలియన్కు చేర్చి టీమిండియాకు బ్రేకిచ్చాడు. అయితే, ఆ తర్వాత సఫారీ బ్యాట్స్మెన్ భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. దక్షిణాఫ్రికా టాపార్డర్లో కీలకమైన వికెట్లను భారత బౌలర్లు సాధించినప్పటికీ ఎల్గర్ మాత్రం పట్టువదలకుండా ఇన్నింగ్స్ ఆడాడు.
ఈ క్రమంలో వికెట్లు తీసేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఈ క్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ పార్ట్ టైమ్ స్పిన్నర్లను సైతం ప్రయోగించాడు. ఇందులో భాగంగా ఓపెనర్ రోహిత్ శర్మతో కూడా బౌలింగ్ వేయించాడు. ఈ మ్యాచ్లో టెస్టు ఓపెనర్గా అరంగేట్రం చేసిన రోహిత్.. తన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు.
ఆటలో భాగంగా మూడో రోజైన శుక్రవారం మొత్తం రెండు ఓవర్లు వేసిన రోహిత్ శర్మ 3.50 ఎకానమీతో 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. రోహిత్ శర్మ బౌలింగ్ చేయడాన్ని చూసిన అతడి అభిమానులు సంతోషంగా ఫీలవుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పంచుకున్నారు.
34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన దక్షిణాఫ్రికాను ఓపెనర్ డీన్ ఎల్గర్(160; 287 బంతుల్లో 18 ఫోర్లు, 4సిక్సర్లు), క్వింటన్ డీకాక్(111; 163 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సులు) సెంచరీలతో ఆదుకున్నారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 118 ఓవర్లకు గాను 8 వికెట్లు కోల్పోయి 385 పరుగులు చేసింది.
సఫారీలు ఇంకా 117 పరుగుల వెనుకంజలో ఉన్నారు. ముత్తుస్వామి(12), కేశవ్ మహరాజ్(3) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (128/5) ఐదు వికెట్లతో సత్తా చాటగా... రవీంద్ర జడేజా 2, ఇషాంత్ శర్మకు ఒక వికెట్ దక్కింది. స్పిన్నర్ల ప్రభావం ఎక్కువగా ఉండటంతో కెప్టెన్ కోహ్లీ ఆ ఇద్దరితోనే ఎక్కువ ఓవర్లు బౌలింగ్ వేయించాడు.