
బైజూస్ లోగోతో కోహ్లీసేన:
గత కరీబియన్ పర్యటన వరకు భారత స్పాన్సర్గా వ్యవహరించిన చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ ఒప్పోకు బదులు కోహ్లీసేన ఆన్లైన్ ట్యుటోరియల్ సంస్థ బైజూస్ లోగోతో ఆడనుంది. కొత్త ఒప్పందం ప్రకారం లర్నింగ్ యాప్ బైజూస్ 2022 మార్చ్ 31 వరకు భారత జట్టు స్పాన్సర్గా వ్యవహరించనుంది. శనివారం ధర్మశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రవిశాస్త్రి కొత్త లోగోతో కూడిన జెర్సీలను ఆవిష్కరించారు.

పరస్పర అంగీకారంతో:
వాస్తవానికి 2017లో రూ. 1079 కోట్లతో బీసీసీఐతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఒప్పోనే ఐదేండ్ల కాలం టీమిండియా స్పాన్సర్గా కొనసాగాల్సి ఉంది. అయితే ఇంత భారీ మొత్తంలో డబ్బులు చెల్లించలేమని పేర్కొంది. బీసీసీఐతో పరస్పర అంగీకారంతో ఒప్పో తన ఒప్పందాన్ని బైజూస్కు బదిలీ చేసింది. దీంతో మిగతా మూడేళ్ల కాలానికి టీమిండియాకు బైజూస్ స్పాన్సర్గా కొనసాగనుంది. 2022 మార్చి 31 వరకు ఒప్పందం ఉంది.

బ్రాండ్ అంబాసిడర్స్గా అగ్ర హీరోలు:
బీసీసీఐకి ఒప్పొ ద్వైపాక్షిక సిరీస్ల్లో ఒక్క మ్యాచ్కు రూ.4.61 కోట్లు, ఐసీసీ టోర్నీల్లోని మ్యాచ్కు రూ.1.56 కోట్లు చెల్లించేది. ఇదే మొత్తాన్ని బైజూస్ కూడా చెల్లించనుంది. ఎనిమిదేళ్ల క్రితం ప్రారంభించిన బైజూస్ కంపెనీ ఆన్లైన్ ఎడ్యుకేషన్ రంగంలో దూసుకుపోతోంది. తెలుగులో మహేష్ బాబు, బాలీవుడ్లో షారూక్ ఖాన్ వంటి అగ్ర నటులు బ్రాండ్ అంబాసిడర్స్గా ఉన్నారు. వీరి ఇద్దరి ప్రచారంతో బైజూస్ ఓ రేంజ్కు చేరుకుంది.

వరుణుడి ముప్పు:
శనివారం చిరు జల్లులు కురవడంతో పిచ్ను కవర్లతో కప్పి ఉంచారు. ఇక ఆదివారం కూడా వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఆదివారం మధ్యాహ్నం చిరుజల్లులు కురిసే అవకాశం 50 శాతం ఉందని తెలిసింది. అయితే సాయంత్రం వరుణుడి ముప్పు తక్కువగా ఉంటుందని సమాచారం అందుతోంది. వర్షం ఒకేసారి కాకుండా కాస్త తెరిపినిస్తూ మళ్లీ కురుస్తుండడంతో సిబ్బందికి మైదానాన్ని సిద్ధం చేయడంలో ఇబ్బంది ఎదురవుతోంది. మ్యాచ్ రాత్రి ఏడు గంటలకు ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications












