అరేబియా సముద్రంలో అల్పపీడనం..
అరేబియా సముద్రంలో మాల్దీవులు, లక్షద్వీప్ ఉపరితలంపై అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. కర్ణాటక తీర ప్రాంతానికి తూర్పు-మధ్య అరేబియా సముద్రంలో నెలకొన్న ఈ అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారడానికి అనుకూలమైన వాతావరణం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సాయంత్రానికి అల్పపీడనం మరింత బలపడుతుందని అంచనా వేశారు. క్రమంగా వాయుగుండంగా మారొచ్చని అన్నారు. అర్ధరాత్రి నుంచి దీని కదలికలు ఉంటాయని చెప్పారు.
ముంబై సహా..
దీని ప్రభావంతో ముంబై, పాల్ఘర్, థానె, రాయగఢ్, రత్నగిరి, సింధుదుర్గ్, ధులె, నాసిక్, పుణె, కొల్హాపూర్, ఔరంగాబాద్ జిల్లాల్లో ఇవ్వాళ ఓ మోస్తరు స్థాయి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయనీ చెప్పారు. దీని ప్రభావంతో ఉత్తర కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్ర, గుజరాత్ ఈశాన్య, దక్షిణ ప్రాంతాలు, కర్ణాటక ఉత్తర తీర ప్రాంత జిల్లాల్లో 48 గంటల పాటు వర్షాలు పడతాయనీ చెప్పారు.
ముంబైలో భారీ వర్షం..
వాతావరణ కేంద్రం అధికారులు వేసిన అంచనాలకు బలపరుస్తూ ముంబైలో ఈ తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది కూడా. వాంఖెడె స్టేడియం ఉన్న చర్చ్గేట్ ప్రాంతంలోనూ వర్షపాతం నమోదైంది. వర్షం కురవడంతో ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారులు పిచ్ను మూసి ఉంచారు. 45 నిమిషాల పాటు వర్షం కురిసింది. వర్షం పడటం ఆగిన తరువాత పిచ్పై కవర్లను తెరిచారు. ప్రస్తుతానికి వర్షం పడట్లేదు. పడదనే గ్యారంటీ లేదు.
తొలి రోజు ఆట అనుమానమే..
దీనితో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య శుక్రవారం ఆరంభం అయ్యే రెండో టెస్ట్ మ్యాచ్పై కొనసాగుతుందా? లేదా? అనేది అనుమానమే. 48 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉండటం వల్ల మ్యాచ్ తొలి రోజు ఉంటుందా? ఉండదా? అనేది తేలట్లేదు. ఇప్పటికి వర్షం పడకపోవడంతో వాంఖెడె స్టేడియం స్టాఫ్ గ్రౌండ్ను ఎండబెడుతున్నారు. ఏ క్షణమైనా మళ్లీ వర్షం పడొచ్చనేలాగా ఉంది అక్కడి వాతావరణం. మళ్లీ వర్షం పడితే మాత్రం మైదానం మొత్తం చిత్తడిగా మారుతుంది.
డ్రాగా తొలి టెస్ట్..
కాగా- ఉత్తర ప్రదేశ్ కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. చివరి రోజు చివరి ఓవర్.. చివరి వికెట్ వరకూ సాగిందీ మ్యాచ్. ఒక్క వికెట్ పడి ఉంటే ఆ మ్యాచ్ భారత్ ఖాతాలో పడి ఉండేది. చివరి రోజు టీమిండియా బౌలర్లు తొమ్మిది ఓవర్లు సంధించినప్పటికీ.. చివరి వికెట్ను తీసుకోలేకపోయారు. న్యూజిలాండ్ టెయిలెండర్ బ్యాటర్లు అసమాన పోరాట పటిమను ప్రదర్శించారు. మ్యాచ్ను డ్రాగా ముగించేయగలిగారు.