ఓపెనర్లు మెరిసేనా:
టాప్ ఆర్డర్లో ఎలాంటి మార్పులు ఉండే అవకాశం లేదు. గాయాలతో సీనియర్ ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు దూరమయిన నేపథ్యంలో తొలి వన్డేతో మయాంక్ అగర్వాల్, పృథ్వీ షాలు ఆడారు. షా అంచనాల్ని అందుకోలేకపోయాడు. 21 బంతులాడి 20 పరుగులే చేసాడు. మయాంక్ అగర్వాల్ 31 బంతుల్లో 6 ఫోర్లతో 32 పరుగులు చేసాడు. మయాంక్ ఫర్వాలేదనిపించినా.. భారీ స్కోరు చేయడంలో విఫలమయ్యాడు. రెండో వన్డేలోనైనా ఈ యువ జోడి గాడిలో పడుతుందేమో చూడాలి.
పటిష్టంగా మిడిల్ ఆర్డర్:
కెప్టెన్ విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, లోకేష్ రాహుల్ వరుసగా 3, 4, 5వ స్థానంలో రానున్నారు. కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక అయ్యర్ 107 బంతుల్లో 103 పరుగులు చేశాడు. కీలక సమయంలో బ్యాట్ జులిపించి వన్డే కెరీర్లో తొలి శతకం బాది మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. రాహుల్ 64 బంతుల్లోనే 88 పరుగులు చేసాడు. భారత్ 347 పరుగుల మెరుగైన స్కోరు చేసిందంటే రాహుల్ మెరుపులే కారణం. ఇక వికెట్ కీపింగ్తో అద్భుతంగా రాణిస్తున్నాడు.
దూబేకు ఛాన్స్:
తొలి వన్డేలో ఆరో స్థానంలో ఆడిన కేదార్ జాదవ్ పర్వాలేదనిపించాడు. 15 బంతుల్లో 26 పరుగులతో అజేయంగా నిలిచాడు. కానీ.. ఆల్రౌండర్ కోటాలో చోటు దక్కించుకున్న జాదవ్ ఒక్క ఓవర్ కూడా వేయలేదు. ఐదుగురు బౌలర్లే బౌలింగ్ చేయగా.. అదనపు బౌలర్ రూపంలో శివమ్ దూబే ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో రెండో వన్డేలో దూబే ఆడనున్నాడు.
కుల్దీప్కు మరో అవకాశం:
న్యూజిలాండ్ గడ్డపై బౌలింగ్లో నిలకడగా రాణిస్తున్న రవీంద్ర జడేజా స్థానంకు ఎలాంటి డోకా లేదు. అయితే బ్యాటింగ్లో మాత్రం అతనికి ఎక్కువగా అవకాశాలు లభించడం లేదు. రెండో వన్డేలో జడేజాని బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకు పంపే అవకాశం ఉంది. ఇక కుల్దీప్ యాదవ్ తొలి వన్డేలో దారుణంగా బౌలింగ్ చేసాడు. ఏకంగా 84 పరుగులిచ్ఛాడు. అయితే టీ20 సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని నేపథ్యంలో అతనికి రెండో వన్డేలో మరో అవకాశమివ్వాలని మేనేజ్మెంట్ భావిస్తోంది.
ఠాకూర్పై వేటు:
తొలి వన్డేలో 10 ఓవర్లు వేసి పొదుపుగానే బౌలింగ్ చేసిన జస్ప్రీత్ బుమ్రా.. ఏకంగా 13 పరుగులు వైడ్స్ రూపంలో ఇచ్చాడు. ఇక డెత్ ఓవర్లలో మునుపటి పదును కనిపించడం లేదు. కీలకమైన రెండో వన్డేలోనైనా ఆదుకోవాలని భారత్ కోరుకుంటోంది. మొహమ్మద్ షమీ కూడా మంచి ప్రదర్శన బాకీ ఉన్నాడు. 80 పరుగులిచ్చిన శార్ధూల్ ఠాకూర్పై వేటుపడే అవకాశం ఉంది. నవదీప్ సైనీకి ఛాన్స్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.
భారత జట్టు (అంచనా):
పృథ్వీషా, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ.