
ఐర్లాండ్లో ప్రధాన కోచ్ పాత్రలో టీమిండియా టీ20 సిరీస్ను పర్యవేక్షించిన వీవీఎస్ లక్ష్మణ్.. ఐర్లాండ్ జట్టు పోరాటపటిమను కొనియాడాడు. ఈ సిరీస్లో ఐర్లాండ్ టీం అసాధారణ పోరాటం ఆకట్టుకుందని, మంగళవారం డబ్లిన్లో జరిగిన రెండో టీ20లో ఆ జట్టు ఆట ఎంతో గొప్పగా ఉందని పేర్కొన్నాడు. ఇక ఈ మ్యాచ్లో 40 ఓవర్లలో 446పరుగులు రావడం ద్వారా అభిమానులకు కావాల్సిన మజా దొరికిందన్నాడు. ఇక ఆండీ బాల్బ్రినీ నాయకత్వంలోని ఐర్లాండ్ టీం.. భారత్కు గట్టి పరీక్ష పెట్టిందన్నాడు. ఈ టీ20 సిరీస్ ద్వారా ఐర్లాండ్ క్రికెట్లో యువ ప్రతిభావంతులు తెరపైకి రావడం ఉత్సాహంగా ఉందన్నాడు.
మంగళవారం డబ్లిన్లోని మలాహిడే క్రికెట్ క్లబ్లో 226పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే విషయంలో ఐర్లాండ్ ధాటిగా పోరాడిన సంగతి తెలిసిందే. ఛేదనలో కేవలం 4పరుగుల దూరంలో ఆ జట్టు విజయానికి దూరమైంది. ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ 18 బంతుల్లో 40పరుగులతో చెలరేగగా.. కెప్టెన్ బాల్బ్రినీ 37 బంతుల్లో 60పరుగులతో రాణించడంతో ఐర్లాండ్ ఓపెనింగ్ జోడీ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. తర్వాత 22 ఏళ్ల హ్యారీ టెక్టర్, జార్జ్ డాక్రెల్తో కలిసి వీరబాదుడు బాదడంతో ఐర్లాండ్ 14వ ఓవర్లో 4వికెట్ల నష్టానికి 142పరుగులు చేసి గెలుపు రేసులోకి వచ్చింది. టెక్టర్ 28 బంతుల్లో 39 పరుగులు చేసి ఔట్ కాగా.. డోక్రెల్ 16 బంతుల్లో 34 పరుగులు చేసి ఔటవ్వడంతో లోయర్ ఆర్డర్ మీద చివర్లో భారం పడింది. బ్యాటర్ మార్క్ అడైర్ 12 బంతుల్లో 23నాటౌట్గా పోరాడినప్పటికీ.. చివరి ఓవర్లో ఉమ్రాన్ మాలిక్ 17పరుగులను విజయవంతంగా డిఫెండ్ చేయడంతో భారత్ గెలుపొంది 2-0తో సిరీస్ని స్వీప్ చేసింది.
వీవీఎస్ లక్ష్మణ్ ఐర్లాండ్ టూర్ అనంతరం ట్వీట్ చేస్తూ.. 'ఇక్కడ నిజంగా గొప్ప టైంను, అనుభవాన్ని పొందాను. మా ప్లేయర్లు ఆడిన తీరు అమోఘం. అలాగే రెండో టీ20లో ఐరిష్ బ్యాటర్లు చూపిన పోరాటం & వారి ఆట విధానం మెచ్చుకోదగినది! ఇలాంటి యువ ప్రతిభావంతులు ఈ టీ20 సిరీస్లోకి వెలుగులోకి రావడం చాలా బాగుంది. ఆతిథ్యాన్ని అందించిన ఐర్లాండ్కు ధన్యవాదాలు' అని లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. ఇక జులై 1న బర్మింగ్హామ్లో ప్రారంభమయ్యే ఇంగ్లాండ్తో రీషెడ్యూల్ చేసిన 5వ టెస్టు కోసం టీమిండియా సన్నాహాకాల కోసం రాహుల్ ద్రావిడ్ను ఇంగ్లాండ్ వెళ్లడంతో.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి చీఫ్ వ్యవహరిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్ భారత టీ20జట్టుకు ప్రధాన కోచ్గా పనిచేశారు.