
చెన్నై: ఇంగ్లండ్తో చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో భారత ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ డకౌట్గా వెనుదిరిగాడు. కేవలం ఐదు బంతులు మాత్రమే ఎదుర్కొని పెవిలియన్ చేరాడు. 420 పరుగుల ఛేదనలో చివరి రోజు కోహ్లీసేన 110/5తో నిలిచిన దశలో క్రీజులోకి వచ్చిన సుందర్.. పేలవ షాట్ ఆడి మూల్యం చెల్లించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో (58 నాటౌట్; 97 బంతుల్లో 10x4) హాఫ్ సెంచరీ చేసి కడవరకు క్రీజులో ఉన్న సుందర్.. మంగళవారం ఒక ఓవర్ కూడా ఆడలేకపోయాడు. ఇక అంపైర్ ఔటివ్వకముందే మైదానం వీడాడు.
ఇన్నింగ్స్ 34వ ఓవర్ వేసిన ఇంగ్లండ్ స్పిన్నర్ డొమినిక్ బెస్ బౌలింగ్లో పాదాల కదలిక లేకుండా బంతిని డిఫెన్స్ చేసేందుకు వాషింగ్టన్ సుందర్ ప్రయత్నించాడు. అయితే ఆఫ్ స్టంప్కి వెలుపలగా పడిన బంతి అతని బ్యాట్ ఎడ్జ్ని తాకి వికెట్ కీపర్ జోస్ బట్లర్ చేతుల్లో పడింది. ఔట్ కోసం ఇంగ్లండ్ అప్పీల్ చేయగా.. బంతి బ్యాట్కి తాకలేదని భావించిన ఫీల్డ్ అంపైర్ అనిల్ కుమార్ చౌదరి ఔటివ్వలేదు. దీంతో ఇంగ్లీష్ కెప్టెన్ జో రూట్ డీఆర్ఎస్ కోరాడు. రిప్లైలో బంతి బ్యాట్ అంచున తాకినట్లు స్పష్టంగా కనిపించింది. దాంతో ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ప్రకటించకముందే సుందర్ మైదానాన్ని వీడాడు.
నాలుగోరోజైన సోమవారం ఓవర్ నైట్ వ్యక్తిగత స్కోరు 33తో బ్యాటింగ్ని కొనసాగించిన వాషింగ్టన్ సుందర్.. 82 బంతుల్లోనే 50 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. రెండో టెస్టు ఆడుతున్న సుందర్కి కెరీర్లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ. ఇటీవల ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్టులోనూ అర్ధ శతకం బాదిన విషయం తెలిసిందే. దీంతో విదేశాల్లో, స్వదేశంలో ఆడిన తొలి టెస్టులోనే హాఫ్ సెంచరీ నమోదు చేసిన 8వ భారత క్రికెటర్గా నిలిచాడు. ఈ జాబితాలో రుషి మోడీ, ఎస్ అమరనాథ్, అరుణ్ లాల్, సౌరవ్ గంగూలీ, సురేశ్ రైనా, హార్దిక్ పాండ్యా, మయాంక్ అగర్వాల్ ఉన్నారు.
చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా పరాజయం పాలైంది. 39/1 ఓవర్ నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట ప్రారంభించిన కోహ్లీసేన.. 192 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 227 పరుగల భారీ తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. 4 వికెట్లతో భారత్ జట్టును స్పిన్నర్ జాక్ లీచ్ దెబ్బతీశాడు. హాఫ్ సెంచరీలతో గిల్, కోహ్లీ పోరాడినా ఫలితం లేకుండాపోయింది. ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ 3 వికెట్లు, జోఫ్రా ఆర్చర్, బెస్, స్టోక్ చెరో వికెట్ తీసుకున్నారు.