హైదరాబాద్: లార్డ్స్ టెస్టులో భారత్ ఓటమి టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలో చాలా మార్పు తెచ్చింది. రెండో టెస్టులో ఘోర ఓటమి అనంతరం కోహ్లీ తన ఫేస్బుక్లో భావోద్వేగంతో కూడిన ఓ పోస్టును అభిమానులతో పంచుకున్నాడు.
ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా 31 పరుగులతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అనంతరం ప్రతిష్టాత్మక లార్డ్స్ క్రికెట్ గ్రాండ్లో జరిగిన రెండో టెస్టులో భారత్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది.
అత్యంత పేలవ ప్రదర్శన కనబర్చి ఇన్నింగ్స్ 159 పరుగులతో ఘోరంగా ఓడిపోయింది. దీంతో భారత జట్టుపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తుది జట్టు కూర్పు సరిగా లేదంటూ కోహ్లీపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ సోమవారం తన ఫేస్బుక్ ఖాతాలో భావోద్వేగమైన పోస్టు చేశాడు.
"కొన్ని సార్లు మేము ఓడిపోతాం.. మరికొన్ని సార్లు నేర్చుకుంటాం. మాపై మీరు పెట్టుకున్న నమ్మకాన్ని వదిలేయవద్దు. మీ నమ్మకాన్ని ఒమ్ము చేయమని మేము వాగ్దానం చేస్తున్నాం. ఎత్తుపల్లాలు సహజం" అని పేర్కొన్న కోహ్లీ టీమిండియా ఆటగాళ్లతో కలిసి ఉన్న ఫొటోని పోస్టు చేశాడు.
కాగా, లార్డ్స్ టె్స్టులో వెన్నునొప్పితో గాయపడిన కోహ్లీ మూడో టెస్టు కోసం ఎలా సన్నద్ధమౌతున్నాడా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాటింగ్హామ్లోని ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా ఆగస్టు 18న భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభం కానుంది.