అహ్మదాబాద్: టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్ను తొలి సారి చూసినప్పుడు'ఎవడు భయ్యా కుమ్మెస్తున్నాడు'అని భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్ను అడిగానని ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ బిల్లింగ్స్ గుర్తు చేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ నుంచి దుమ్మురేపుతున్న్ పంత్.. ఇంగ్లండ్తోనూ అదే జోరును కనబర్చాడు. ముఖ్యంగా అహ్మదాబాద్ వేదికగా జరిగిన చివరి టెస్టులో తీవ్ర ఒత్తిడిలో అద్భుత సెంచరీతో జట్టుకు విజయాన్నందించాడు. ఇక ఈ మ్యాచ్ విన్నర్ పెర్ఫామెన్స్పై తాజాగా స్పందించిన సామ్ బిల్లింగ్స్.. పంత్తో తనకు జరిగిన మొదటి పరిచయాన్ని గుర్తు చేసుకున్నాడు.
'నేను పంత్ను మొదటిసారి చూసింది 2016 ఐపీఎల్లో అనుకుంటా. ఇద్దరం కలిసి రెండేళ్లు ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడాం. అండర్ 19 ప్రపంచకప్లో రన్నరప్గా నిలిచిన టీమిండియా జట్టులో సభ్యుడిగా ఉన్న పంత్ అదే దూకుడుతో అప్పటి ఢిల్లీ డేర్డెవిల్స్కు ఎంపికయ్యాడు. నెట్ ప్రాక్టీస్ సమయంలో మా బౌలర్లు నాథర్ కౌల్టర్నీల్, క్రిస్ మోరిస్, కగిసో రబడ ఇలా ఎవరు బౌలింగ్ వేసినా కుమ్మేస్తున్నాడు. దీంతో అప్పటి మెంటార్ రాహుల్ ద్రవిడ్వైపు తిరిగి.. ఎవరీ కుర్రాడు.. కుమ్మేస్తున్నాడని అడిగా'అని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
అయితే ఇదే బిల్లింగ్స్ 2017లో ధోని స్థానాన్ని భర్తీ చేసే అర్హత పంత్కు మాత్రమే ఉందని చెప్పడం అప్పట్లో విమర్శలకు దారి తీసింది. కాగా 2015లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన సామ్ బిల్లింగ్స్ ఇంగ్లండ్ తరపున 21 వన్డేల్లో 586 పరుగులు, 30 టీ20ల్లో 391 పరుగులు చేశాడు. టీ20 స్టార్గా మారిన బిల్లింగ్స్ కెరీర్లో 2020 సంవత్సరం చెప్పుకోదగ్గది. కరోనాతో మ్యాచ్లు జరగకపోయినా.. ఇటు ఇంగ్లండ్ తరపున.. ఆ తర్వాత బిగ్బాష్ లీగ్లో సిడ్నీ థండర్స్ తరపున మెరుపులు మెరిపించాడు. తాజాగా ఫిబ్రవరిలో జరిగిన వేలంలో రూ.2 కోట్లకు తిరిగి ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది.