India vs England: రోహిత్ హిట్టింగ్.. రహానే క్లాస్! భారీ స్కోర్ దిశగా భారత్!

చెన్నై: చెపాక్ మైదానంలో ఇంగ్లండ్తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్ దిశగా వెళుతోంది. తొలిరోజు ఆట ముగిసేసరికి టీమిండియా 88 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 300 రన్స్ చేసింది. రిషభ్ పంత్ (33, 56 బంతుల్లో, 5×4, 1×6), అక్షర్ పటేల్ (5, 7 బంతుల్లో, 1×4) పరుగులతో క్రీజులో ఉన్నారు. సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ (161: 231 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్సర్లు) భారీ సెంచరీతో మెరవగా.. వైస్ కెప్టెన్ అజింక్య రహానే (67: 149 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ శతకం చేశాడు. ఇంగ్లీష్ బౌలర్లలో స్పిన్నర్లు మొయిన్ అలీ, జాక్ లీచ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. స్టోన్, రూట్ తలో వికెట్ తీశారు.

ఆదిలోనే భారీ షాక్:
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. యువ ఓపెనర్ శుభమన్ గిల్ పేలవరీతిలో వికెట్ చేజార్చుకున్నాడు. ఇన్నింగ్స్ 2వ ఓవర్ వేసిన ఫాస్ట్ బౌలర్ ఓలీ స్టోన్ బౌలింగ్లో బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన గిల్ (0) ఎల్బీడబ్ల్యూగా ఔటైపోయాడు. దాంతో భారత్ పరుగుల ఖాతా కూడా తెరవకుండా తొలి వికెట్ చేజార్చుకుంది. ఆపై వన్డౌన్లో వచ్చిన
చేటేశ్వర్ పుజారాతో కలిసి రోహిత్ శర్మ ఇన్నింగ్స్ చక్కదిద్దడానికి ప్రయత్నించాడు. చెన్నై పిచ్ బౌలర్లకు సహకరిస్తున్నా.. వన్డే తరహాలో దూకుడుగా ఆడి పరుగులు సాధించాడు. ఫుల్ షాట్లు, కట్ షాట్లతో ఫ్రంట్ ఫుట్పైకి వచ్చి మరీ రోహిత్ భారీ షాట్లు ఆడాడు.

కోహ్లీ డకౌట్:
దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ 47 బంతుల్లో అర్ధ శతకం అందుకున్నాడు. ఇదే సమయంలో ఇంగ్లీష్ బౌలర్లు పుంజుకుని వరుస ఓవర్లలో పుజారా (21; 58 బంతుల్లో, 2×6), విరాట్ కోహ్లీ (0)ని పెవిలియన్కు చేర్చారు. స్పిన్నర్ జాక్ లీచ్ వేసిన బంతిని సరిగా అర్ధం చేసుకోలేక స్లిప్లో క్యాచ్ ఇచ్చి పుజారా వెనుదిరిగాడు. కోహ్లీ.. మొయిన్ అలీ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో భారత్ 86 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఆపై రోహిత్, అజింక్య రహానే జాగ్రత్తగా ఆడుతూ స్కోరును 100 దాటించారు. లంచ్ సమయానికి భారత్ మూడు వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది.

రోహిత్ హిట్టింగ్, రహానే క్లాస్:
పిచ్ బౌలర్లకు సహకరిస్తుండటంతో టీమిండియా మరోసారి తక్కువ స్కోరుకు వెనుదిరుగుతుందేమోనని అందరూ అనుకున్నారు. కానీ హిట్మ్యాన్ హిట్టింగ్, రహానే క్లాస్ కారణంగా భారత్ పోటీలో నిలిచింది. ఈ జోడి నాలుగో వికెట్కు 162 పరుగులు జోడించారు. రెండో సెషన్లో వికెట్ కోల్పోకుండా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో రోహిత్ సెంచరీ చేశాడు. 130 బంతుల్లో శతకం అందుకున్నాడు. సెంచరీ ముందు కాస్త నెమ్మదిగా ఆడాడు. మరోవైపు రహానే 104 బంతుల్లో అర్ధ శతకం సాధించడంతో.. టీ విరామానికి భారత్ 189/3తో పటిష్ట స్థితిలో నిలిచింది.

మూడో సెషన్లో 3 వికెట్లు:
మూడో సెషన్లోనూ రోహిత్, రహానే వేగంగా ఆడారు. చెత్త బంతులను బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. ఈ క్రమంలో రోహిత్ 208 బంతుల్లో 150 మార్క్ అందుకున్నాడు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ జోడి పెవిలియన్ చేరింది. లీచ్ బౌలింగ్లో భారీ షాట్కు యత్నించి రోహిత్ ఔటవ్వగా.. తర్వాతి ఓవర్లోనే రహానేను అలీ బౌల్డ్ చేశాడు. దీంతో 249 పరుగులకు టీమిండియా ఐదు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్, ఆర్ అశ్విన్ దూకుడుగా ఆడారు. పంత్ మరోసారి భారీ షాట్లతో అలరించాడు. అయితే ఆట ఆఖరిలో అశ్విన్ (13; 19 బంతుల్లో, 1×4) ను రూట్ ఔట్ చేశాడు. అక్షర్ అండతో మరో వికెట్ పడకుండా పంత్ ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications