చెన్నై: ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆతిథ్య భారత్ నిలకడగా ఆడుతోంది. స్వల్ప స్కోరుకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆదుకున్నాడు. కీలక సమయంలో అద్భుత సెంచరీ చేసిన రోహిత్ భారీ ఇన్నింగ్స్ దిశగా సాగుతున్నాడు. తొలి రోజు ఆటలో టీ విరామ సమయానికి టీమిండియా 54 ఓవర్లలో 3 వికెట్లకు 189 పరుగులు చేసింది. రోహిత్ (132), రహానే (36) క్రీజులో ఉన్నారు. తొలి రోజు భారత్ రెండో సెషన్లో 83 పరుగులు చేసింది. ఇప్పటివరకు రోహిత్, రహానే మధ్య 103 పరుగుల (196 బంతులు) భాగస్వామ్యం నమోదైంది.
తొలి సెషన్లో ఓపెనర్ శుభ్మన్ గిల్ (0)తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ (0) కూడా డకౌట్లుగా వెనుదిరగడంతో టీమిండియా కష్టాల్లో పడింది. దానికి తోడు టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ చతేశ్వర్ పుజారా (21) కూడా తక్కువ పరుగులకే అవుట్ కావడంతో కోహ్లీసేన 106 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఇలాంటి తరుణంలో ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతంగా రాణించాడు. అతడికి తోడు ఆజింక్య రహానే కూడా క్రీజులో నిలదొక్కుకోవడంతో రెండో సెషన్లో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా టీమిండియా 83 పరుగులు చేసింది.
భోజన విరామం తర్వాత జట్టు స్కోర్ 106/3తో ఈ సెషన్ కొనసాగించిన రోహిత్(132), రహానె(36) నిలకడగా ఆడుతూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తపడ్డారు. ఈ క్రమంలోనే హిట్మ్యాన్ టెస్టుల్లో ఏడో శతకం పూర్తి చేసుకున్నాడు. అలాగే రహానెతో కలిసి హిట్మ్యాన్ నాలుగో వికెట్కు శతక భాగస్వామ్యం జోడించాడు. ఈ నేపథ్యంలోనే టీ విరామ సమయానికి భారత్ 54 ఓవర్లలో 189/3 స్కోరుతో కొనసాగుతోంది.
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరిట ఓ చెత్త రికార్డు నమోదు అయింది. రెండో టెస్టులో భాగంగా కోహ్లీ ఇంగ్లండ్ స్పిన్నర్ మెయిన్ అలీ బౌలింగ్లో క్లీన్బౌల్డ్ అయి డకౌట్గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. దీంతో తన టెస్టు కెరీర్లో విరాట్ 11వ సారి డకౌట్గా వెనుదిరగ్గా.. ఒక స్పిన్నర్ బౌలింగ్లో డకౌట్ కావడం ఇదే తొలిసారి. అంతకముందు 10 సార్లు కోహ్లి ఫాస్ట్ బౌలర్ల చేతిలోనే డకౌట్గా వెనుదిరగాడు. రవి రాంపాల్, బెన్ హిల్పెనాస్, లియాన్ ఫ్లంకెట్, జేమ్స్ అండర్సన్, మిచెల్ స్టార్క్, సురంగ లక్మల్, స్టువర్ట్ బ్రాడ్, పాట్ కమిన్స్, కీమర్ రోచ్, అబి జావెద్లు ఫాస్ట్ బౌలర్లు కాగా.. అలీ ఒక్కడే కోహ్లీని డకౌట్ చేసిన స్పిన్నర్గా అరుదైన గుర్తింపు పొందాడు.
India vs England: హిట్మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీ.. 15 నెలల తర్వాత!!