పూణె: భారత్-ఇంగ్లండ్ మధ్య ప్రస్తుతం నాలుగు టెస్ట్ల సిరీస్ జరుగుతోంది. ఇందులో మరో టెస్ట్ మిగిలి ఉంది. దీని తర్వాత ఇరు జట్ల మధ్య ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్ జరగాల్సి ఉంది. నాలుగో టెస్ట్తో పాటు ఐదు టీ20లూ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరగనున్నాయి. ఆ తర్వాత జరిగే మూడు వన్డేల సిరీస్కు మాత్రం పుణె వేదికగా ఉంది. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సిరీస్ను పుణె నుంచి మరో చోటికి మారుస్తారన్న వార్తలు వచ్చాయి.
దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కేసులు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. వన్డేలు జరగాల్సిన పుణెలో గురువారం ఒక్కరోజే 1542 కేసులు నమోదు కాగా.. 8 మంది చనిపోయారు. దీంతో వేదికను మరోసారి మార్చే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అవన్ని నిజం కాదని తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. టోర్నీ నిర్వహణకు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది.
అయితే వన్డే మ్యాచులను లైవ్లో చూసేందుకు మాత్రం ప్రేక్షకులకు అనుమతి లేదు. దీంతో వన్డే మ్యాచ్లను ప్రత్యక్షంగా చూడాలనుకున్న పూణే వాసులకు నిరాశే మిగిలింది. మార్చి 23, మార్చి 26, మార్చి 28న ఈ మూడు వన్డేలు జరగాల్సి ఉన్నాయి. త్వరలోనే వన్డేలకు బీసీసీఐ జట్టును ప్రకటించనుంది. వన్డే సిరీస్ అనంతరం భారత ఆటగాళ్లు ఐపీఎల్ 2021 ఆడనున్నారు. ఐపీఎల్ భారత్లోనే నిర్వహించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.
కరోనా మహమ్మారి సమస్య పూర్తిగా సమసిపోలేదు కాబట్టి ఐదు వేదికల్లో ఐపీఎల్ మ్యాచులు జరపాలని ఐపీఎల్ పాలక మండలి భావిస్తున్నట్టు తెలుస్తోంది. చెన్నై, కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు, ముంబైని వేదికలుగా ఎంపిక చేశారని సమాచారం. అయితే ముంబై కోసం మహారాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరారని ఇంకా ధ్రువీకరణ రాలేదని తెలిసింది. అయితే గతంలో మాదిరిగా రోజుకో స్టేడియంలో మ్యాచులు జరగవు. ఒక్కో మైదానంలో ఒకసారి అన్ని జట్లు తలపడతాయి. ఆ తర్వాత వేదిక మారుతుంది. ఇక లీగ్ మ్యాచులు ముగిశాక మొతేరాలో ప్లేఆఫ్స్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారట. ఎందుకంటే.. 50% అభిమానులు వచ్చినా 55వేల మంది వస్తారు.
ISL 2020 21: ఒడిశాతో ఈస్ట్ బెంగాల్ ఢీ.. చివరి మ్యాచ్లో విజయం ఎవరిది?