'వాళ్లను మాత్రం ఎవరూ అడగరు.. స్పిన్నర్ల విషయంలోనే ప్రశ్నిస్తారు! ఇదెక్కడి న్యాయం'

హైదరాబాద్: అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసిన విషయం తెలిసిందే. స్పిన్కి అతిగా అనుకూలించిన ఈ పిచ్పై భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ వికెట్ల పండగ చేసుకోవడంతో.. మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగిసిపోయింది. రెండో ఇన్నింగ్స్లో రెండు జట్ల ఫాస్ట్ బౌలర్లు కనీసం ఒక్క ఓవర్ కూడా వేయలేదు. టెస్టు రెండు రోజుల్లోనే పూర్తవ్వడం పట్ల పిచ్పై అనేక విమర్శలు వస్తున్నాయి. టెస్టు మ్యాచ్కు ఇలాంటి పిచ్ ఉండకూడదని పలువురు మాజీలు అభిప్రాయపడ్డారు.

వారిని ఎవరూ అడగరు:
మొత్తం మ్యాచ్లో 30లో 28 వికెట్లు స్పిన్నర్లకే దక్కాయి. దీంతో మొతేరాలో బ్యాట్స్మెన్ విఫలమయ్యారా? లేక స్పిన్నర్లు ఆధిపత్యం చెలాయించారా? అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే మాజీ క్రికెటర్ ప్రగ్యాన్ ఓజా వీటన్నింటికి బదులిచ్చాడు. తాజాగా ఓ జాతీయ క్రీడా ఛానల్తో ఓజా మాట్లాడుతూ... ఎవరైనా బాట్స్మెన్ ఒక ఇన్నింగ్స్లో 400 లేదా 300 పరుగులు సాధిస్తే ఎవరూ అడగరని, అదే స్పిన్నర్లు వికెట్లు పడగొట్టితే మాత్రం అందరూ ప్రశ్నిస్తారన్నాడు. ఇదెక్కడి న్యాయం అంటూ హైదరాబాద్ మాజీ స్పిన్నర్ విమర్శకులను ప్రశ్నించాడు.

స్పిన్నర్ల విషయంలోనే ఇలా:
'ఇది పోటీపడే వికెట్. బ్యాట్స్మెన్ బాగా ఆడాల్సింది. కానీ స్పిన్నర్లు మంచి ప్రదర్శన చేసినప్పుడే ఇలా ఎందుకు అడుగుతారు. బ్యాట్స్మెన్ భారీ స్కోర్ సాధిస్తే.. ప్రపంచ రికార్డు నెలకొల్పాడని మెచ్చుకుంటారు. ఒక ఇన్నింగ్స్లో 400 లేదా 300 పరుగులు చేస్తే ఎవరూ అడగరు. పేసర్లు వికెట్లు తీస్తే బంతిని బాగా స్వింగ్ చేశాడని ప్రశంసిస్తారు. మరి స్పిన్నర్ల విషయంలోనే పిచ్ ఎందుకిలా ప్రవర్తిస్తుంది? అంటూ ప్రశ్నలు వేస్తారు' అని ప్రగ్యాన్ ఓజా మండిపడ్డాడు.

పిచ్ విషయంలో ఎలాంటి తప్పు లేదు:
డే/నైట్ టెస్టులో పిచ్ను తప్పుపట్టాల్సిన పని లేదని, నేరుగా వికెట్లకు విసిరిన బంతులకే చాలా మంది బ్యాట్స్మెన్ ఔటయ్యారని భారత ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లే కాకుండా భారత బ్యాట్స్మెన్ కూడా తప్పులు చేశారన్నాడు. తొలి ఇన్నింగ్స్లో తామూ సరిగ్గా ఆడలేకపోయామని స్పష్టం చేశాడు. పిచ్ విషయంలో ఎలాంటి తప్పు లేదని, దానిపై దెయ్యాలేం లేవన్నాడు. ఒక్కసారి కుదురుకుంటే ఆ పిచ్ మీద పరుగులు చేయొచ్చని రోహిత్ పేర్కొన్నాడు.

ఫన్నీగా పోస్టులు చేస్తున్న నెటిజన్లు:
మూడో టెస్టు మ్యాచ్ రెండు రోజుల్లోనే ముగియడంపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. అంతేకాదు పలు రకాల మీమ్స్ని క్రియేట్ చేశారు. 'స్పిన్ పిచ్లతో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లను ప్రస్తుతం భారత్ ఇబ్బందిపెడుతుంది. భారత్ జట్టు అక్కడికి వెళ్లినపుడు పచ్చిక బాగా ఉన్న పిచ్లను ఇంగ్లండ్ తయారు చేస్తుంది' అని కొంత మంది నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఇక ఇరు జట్ల మధ్య ఇదే వేదికగానే మార్చి 4 నుంచి నాలుగో టెస్టు ప్రారంభంకానుంది. మరి అప్పుడు పిచ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications