కోహ్లీ భయ్యా ఒకటే చెప్పాడు
'ఇది బ్యాటింగ్ వికెట్. బ్యాట్పైకి బంతి మంచిగా వస్తుంది. కానీ బౌలింగ్లో మా వ్యూహాలు అమలు చేసి ఇంగ్లండ్ను ఆలౌట్ చేశాం. పదే పదే ఒకే స్పాట్లో బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ ఇబ్బందిపడి వికెట్లు సమర్పించుకున్నారు. నాకు కోహ్లీ భయ్యా ఒకటే చెప్పాడు. ఫాస్ట్ బౌలర్లు ఇద్దరే ఉన్న సంగతిని గుర్తుచేశాడు. మీ ఇద్దరూ (ఇషాంత్ శర్మ) ఫాస్ట్ బౌలింగ్ రొటేట్ చేయాల్సి ఉంటుందని చెప్పాడు. నేను రిలయన్స్ ఎండ్ నుంచి బౌలింగ్ చేయడం ప్రారంభించా. అదనపు బౌన్స్ రావడాన్ని గమనించా. ఇది బౌలర్లకు లాభిస్తుందని అనుకున్నా' అని సిరాజ్ చెప్పాడు.
రూట్ను బోల్తా కొట్టించడం బాగుంది
'జో రూట్ను బోల్తా కొట్టించడం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. రూట్కు ముందు నుంచీ క్రీజుకు దూరంగా బంతులు వేశాను. వాటికి అలవాటు పడేలా చేశాను. ఆ తర్వాత ఒక కొత్త ఓవర్ కోసం బంతి తీసుకున్నప్పుడు ఒక బంతి లోపలికి వేయాలనుకున్నా. అనుకున్నట్టుగా అలా విసిరి ఔట్ చేశా. ప్రణాళికను కచ్చితత్వంతో అమలు చేయడం ఎంతో సంతృప్తినిచ్చింది. చాలా సరదాగా అనిపించింది' అని హైదరాబాద్ పేసర్ మొహ్మద్ సిరాజ్ తెలిపాడు.
పుటేజీ చూశాక వ్యూహం మార్చా
జానీ బెయిర్స్టోకు గంటకు 146 కి.మీ వేగంతో ఇన్స్వింగర్ విసిరి ఎల్బీ చేశాడు. దానిపై సిరాజ్ మాట్లాడుతూ... 'మొదట్లో బెయిర్స్టోకు తక్కువ వేగంతో బంతులు వేశాను. ఆ తర్వాత అతడు ఇన్స్వింగర్లకు ఔటైన పుటేజీ చూశాక వ్యూహం మార్చాను. ఒక ప్రాంతంలో బంతులు వేయడం మొదలుపెట్టాను. క్రమంగా నిలకడగా లోపలికి వేయడం ఆరంభించాను. అది పనిచేసింది' అని చెప్పాడు. రంజీ మ్యాచులు ఆడుతున్నప్పటి నుంచే మంచి ప్రాంతాల్లో బంతులు విసిరాలని నేర్చుకున్నానని, ఓపికతో ఉండటం అవసరమని సిరాజ్ చెప్పుకొచ్చాడు.
కచ్చితత్వంతో వేయాలనే చూస్తున్నా
'నేను ఆస్ట్రేలియాలో ఆడినప్పుడు కానీ, స్వదేశంలో ఆడుతున్నప్పుడు కానీ ప్రతీ బంతిని వంద శాతం కచ్చితత్వంతో వేయాలనే చూస్తున్నా. నేను నా ప్రణాళిక అమలు చేసినప్పుడు అది ఒత్తిడి నుంచి బయటపడటానికి దోహదం చేస్తుంది. ఇప్పుడు కూడా నా ప్లాన్ను అమలు చేశా. బెన్ స్టోక్స్ నాతో వాగ్వాదానికి దిగినప్పుడు మా సారథి హ్యాండిల్ చేసిన విధానం బాగుంది' అని హైదరాబాద్ గల్లీ పేసర్ తెలిపాడు. ఇంగ్లిష్ బ్యాట్స్మెన్ తొందరపాటు వల్ల తొలి రోజు ఆటలో భారత్దే పైచేయి అయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 205 పరుగులకు ఆలౌటైంది.
India vs England: 'నా 70 టెస్టుల్లో ఎదుర్కొన్న కష్టతరమైన పరిస్థితులు ఇవే.. నాపై నాకే చిరాకేసింది'