పంత్తోనే అంచనా తప్పింది..
ఆసీస్ పర్యటనలో భారత్ 0-4తో వైట్ వాష్ అవుతుందని చెప్పి నాలుక కరుచుకున్న వాన్.. రిషభ్ పంత్ కారణంగానే తన అంచనా తప్పయిందన్నాడు. మ్యాచ్లను గెలిపించే సత్తా రిషభ్ పంత్కు ఉందని అభిప్రాయపడ్డాడు. పంత్ ఆటను తాను ఎంతో ఆస్వాదిస్తానని తెలిపాడు. ఇక సిడ్నీ, బ్రిస్బేన్ టెస్ట్ల్లో పంత్ 97, 89 నాటౌట్ అద్భుత ఇన్నింగ్స్లతో రాణించి భారత విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 'బెన్ స్టోక్స్లానే రిషభ్ పంత్ కూడా ఆస్వాదిస్తూ క్రికెట్ ఆడతాడు. వీరిద్దరి ఆటను నేను చాలా ఆస్వాదిస్తాను. పంత్ క్రీజులో ఆడుతూ ప్రత్యర్థికి సవాళ్లు విసురుతున్నప్పుడు అతను నాకు 11 ఏళ్ల చిన్న కుర్రాడిలా కనిపిస్తాడు.
సెహ్వాగ్లా దడపుట్టిస్తూ..
అతను క్రీజులో కుదురుకుంటే మాత్రం తనదైన ఆటతో చెలరేగుతాడు. అతని బ్యాటింగ్లో నాకు సెహ్వాగ్ లక్షణాలు కనిపిస్తాయి. టీమిండియా ఓపెనర్గా సెహ్వాగ్ ప్రత్యర్థులకు దడపుట్టించాడు. పంత్ కూడా అలానే చేస్తున్నాడు. తనదైన సిక్స్లతో సెహ్వాగ్ ప్రత్యర్థి బౌలర్లను వణికించేవాడు. పంత్ కూడా అదే ఆట తీరుతో భయపెడుతున్నాడు. చిన్న తప్పిదాల వల్ల తక్కువ స్కోరుకే ఔట్ అయ్యాడు. కానీ ఎన్నో సందర్భాల్లో మ్యాచులను గెలిపించాడు.'అని మైఖెల్ వాన్ చెప్పుకొచ్చాడు.
టీమ్ ఎంపికపై ఫైర్..
భారత్తో సిరీస్ కోసం ఎంపిక చేసిన ఇంగ్లండ్ జట్టులోకి స్టార్ బ్యాట్స్మన్ జానీ బెయిర్స్టోను ఎంపిక చేయకపోవడంపై వాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రపంచం ఏమైనా పిచ్చిదా?.. స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కొనే బెయిర్స్టోను ఎందుకు పక్కన పెట్టారని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ)ను ప్రశ్నించాడు. 'భారత్తో నాలుగు టెస్టుల సిరీస్ ఆరంభ మ్యాచ్లకి జానీ బెయిర్స్టో జట్టులో ఉండింటే బాగుండేది. ఉపఖండం పిచ్లపై స్పిన్నర్లని సమర్థంగా ఎదుర్కోగల ఇంగ్లాండ్ టాప్-3 బ్యాట్స్మెన్లలో బెయిర్స్టో కూడా ఒకడు. మరి అలాంటి బ్యాట్స్మెన్ని తొలి రెండు టెస్టులకి దూరంగా పెట్టడం.. తెలివైన నిర్ణయం కాదు. క్రికెట్ ప్రపంచంలో భారత్ అత్యుత్తమ జట్టుగా ఉంది. మరి అలాంటి జట్టుపై బరిలోకి దిగే సమయంలో జట్టు కూడా బలంగా ఉండాలి. ప్రపంచం ఏమైనా పిచ్చిదా?' అని మైఖెల్ వాన్ ట్వీట్ చేశారు.