
లండన్: లార్డ్స్ వేదికగా ఇండియా-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో కోహ్లీసేన బ్యాటింగ్కు దిగింది. భారత జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. శిఖర్ ధావన్, ఉమేశ్ యాదవ్ స్థానాల్లో పుజారా, కుల్దీప్ యాదవ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.
తొలి టెస్టుకు పుజారాను రిజర్వ్ బెంచ్కే పరిమితం చేయడంపై విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ధావన్ స్థానంలో పుజారాను ఎంపిక చేసి.. లోకేశ్ రాహుల్ను ఓపెనర్గా బరిలో దించుతున్నట్లు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వెల్లడించాడు. మరోవైపు పేసర్ ఉమేశ్ స్థానంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను తుది జట్టులోకి తీసుకున్నాడు.
లార్డ్స్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందన్న నేపథ్యంలో రెండో స్పిన్నర్ వైపే భారత్ మొగ్గుచూపింది. ఇద్దరు సీనియర్ పేసర్లు, ఒక ఆల్రౌండర్తో రెడీగా ఉన్నట్లు కోహ్లీ వివరించాడు. ఇక, ఇంగ్లాండ్ జట్టు తరుపున ఈ టెస్టులో ఒలీ పోప్ అరంగేట్రం చేశాడు.
ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా రెండో టెస్టు గురువారం ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ... వర్షం కారణంగా ఒక రోజు ఆలస్యమైంది. గురువారం ఒక్క బంతి కూడా పడలేదు. టాస్ కూడా వేయలేదు. 2001 తర్వాత వర్షం కారణంగా లార్డ్స్లో ఒక్క బంతి పడకుండా టెస్టు మ్యాచ్ ఒక రోజు ఆట రద్దు అవడం ఇప్పుడే తొలిసారి.
తొలిరోజు టీ విరామం తర్వాత 45 నిమిషాలకు కొద్దిగా తెరిపినివ్వడంతో మైదానం సిబ్బందిని రంగంలోకి దిగారు. కానీ అప్పటికే రెండుసార్లు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు ఔట్ ఫీల్డ్ బాగాలేదని తొలి రోజు ఆటను రద్దు చేశారు. మిగతా నాలుగు రోజులు 96 ఓవర్లపాటు ఆటను కొనసాగించనున్నారు.
ఈ టెస్టులో ఒలీ పోప్ ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేశాడు. ఐదు మ్యాచ్ల సిరీస్లో ఎడ్జ్బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో భారత్ 31 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో లార్డ్స్ టెస్టులో గెలవడం ద్వారా సిరీస్ను సమం చేయాలని టీమిండియా కెప్టెన్ కోహ్లీ భావిస్తున్నాడు. ఇప్పటివరకు ఈ మైదానంలో 17 టెస్టులాడిన భారత్ కేవలం రెండింటిలోనే గెలిచింది. నాలుగు డ్రా కాగా, 11 మ్యాచుల్లో ఓడింది.