హైదరాబాద్: స్వదేశంలో టీమిండియాతో జరిగిన తొలి టీ20లో ఓటమిపాలైన ఇంగ్లాండ్... రెండో టీ20లో తప్పక రాణిస్తుందని ఆ జట్టు ఓపెనర్ జోస్ బట్లర్ ధీమా వ్యక్తం చేశాడు. మూడు టీ20ల సిరిస్లో భాగంగా మాంచెస్టర్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన తొలి టీ20లో బౌలింగ్లో కుల్దీప్ యాదవ్, బ్యాటింగ్లో కేఎల్ రాహుల్ రాణించడంతో ఆతిథ్య ఇంగ్లాండ్పై కోహ్లీసేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
టోర్నీలో భాగంగా ఇరు జట్ల మధ్య రెండో టీ20 శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో జోస్ బట్లర్ మాట్లాడుతూ "సిరీస్లో ఒక మ్యాచ్ మాత్రమే ముగిసింది. అది కూడా టీ20 మ్యాచ్. మేము ఇంకా ఆత్మవిశ్వాసంతోనే ఉన్నాం. కచ్చితంగా రెండో టీ20 మ్యాచ్లో పుంజుకుని భారత్కి గట్టి పోటీనిచ్చి ఓడిస్తాం" అని అన్నాడు.
తొలి టీ20లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ విఫలమైనప్పటికీ... ఓపెనర్ జోస్ బట్లర్ (69; 46 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులు)లతో హాఫ్ సెంచరీ నమోదు చేసి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తోందని బట్లర్ కొనియాడాడు.
"ఇండియా కోహ్లీ నాయకత్వంలో అద్భుత ప్రదర్శన చేస్తోంది. క్రికెట్ ఆడే దేశాల్లో భారత్ అద్భుతమైనది. భారత జట్టుపై అత్యుత్తమ ప్రదర్శన చేస్తేనే విజయం వరిస్తుంది" అని అన్నాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన సిరీస్లో 481 పరుగులు చేసి ఇంగ్లాండ్ వరల్డ్ రికార్డ్ని నెలకొల్పింది.
అంతేకాదు ఐదు వన్డేలు, ఒక టీ20 సిరీస్ని క్లీన్స్వీప్ చేసింది. ఆ తర్వాత భారత్తో జరిగిన తొలి టీ20లో కుల్దీప్ యాదవ్ ధాటికి 159 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. తొలి టీ20లో విజయం సాధించడంతో మూడు టీ20ల సిరిస్లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.