చెన్నై: నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మొదటి టెస్టు ఫిబ్రవరి 5న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆరంభంకానుంది. ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలిచిన భారత్, శ్రీలంకపై సిరీస్ క్లీన్ స్వీప్ చేసిన ఇంగ్లాండ్ అమితుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ పర్యటన నేపథ్యంలో ఇంగ్లీష్ జట్టు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు బ్యాటింగ్ లైనప్లో అత్యంత ప్రమాదరకరం ఎవరు? అనే ప్రశ్నకు ఆర్చర్ ఇంట్రస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. తొలి టెస్ట్ నేపథ్యంలో మంగళవారం ఓ వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆర్చర్ మాట్లాడాడు.
టీమిండియా బ్యాటింగ్ లైనప్లో అత్యంత ప్రమాదరకరం ఎవరు? అని ఓ విలేకరి జోఫ్రా ఆర్చర్ను అడగ్గా.. 'ఇది పెద్ద విషయమే కాదు. భారత జట్టులో 1 నుంచి 6వ నెంబర్ బ్యాట్స్మెన్ వరకూ అందరూ ప్రమాదకారులే' అని సమాధానం ఇచ్చాడు. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానే, రిషబ్ పంత్ టీమిండియా నెంబర్ 6 బ్యాట్స్మన్లు. 'జట్టు మీటింగ్స్ జరుగుతున్నాయి. మ్యాచ్ ఆరంభానికి ముందు కూడా ఓ సమావేశం ఉంది. వికెట్ చూసిన తర్వాత సరైన ప్రణాళికతో వస్తాం' అని ఆర్చర్ పేర్కొన్నాడు.
భారత పేస్ తురుపు ముక్క జస్ప్రీత్ బుమ్రా గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు జోఫ్రా ఆర్చర్ ఆలస్యం చేయకుండా బదులిచ్చాడు. మీకు బుమ్రా రోల్ మోడలా అని అడగ్గా.. 'అవును' అని చెప్పాడు. బుమ్రా బౌలింగ్లో నీకు ఏం నచ్చుతుందనగా.. 'బుమ్రా చాలా నిలకడగా రాణిస్తాడని, అది నాకు బాగా నచ్చుతుంది' అని అన్నాడు. ఐపీఎల్ టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆర్చర్ ఆడుతున్నాడు. 35 మ్యాచులలో 46 వికెట్లు తీశాడు. ఆర్చర్ భారతదేశంలో ఐపీఎల్ మ్యాచులు మాత్రమే ఆడాడు.
ఆరు రోజుల క్వారంటైన్ అనంతరం కరోనా పరీక్షల్లో నెగెటివ్ రావడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లు మంగళవారం నుంచి నెట్ సెషన్లో పాల్గొన్నారు. ఈరోజు నుంచి పూర్తిస్థాయి సాధన చేయనున్నారు. లంక పర్యటన నుంచి భారత్ వచ్చిన ఇంగ్లండ్ ఆటగాళ్లకు కేవలం రెండు రోజులు మాత్రమే సన్నద్దతకు సమయం ఉంది. ఇక శ్రీలంకతో టెస్టులకు బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ జట్టుకంటే మూడు రోజుల ముందే భారత్కు చేరుకున్నారు. మూడు రోజుల క్రితమే క్వారంటైన్ పూర్తిచేసి సాధన చేస్తున్నారు.
బలమైన టాపార్డర్.. అద్భుతాలు చేయగల పేస్ జోడి! ఇంగ్లండ్ను తక్కువగా అంచనావేశారో అంతేఇక!