న్యూఢిల్లీ: టీమిండియాలో సాధ్యమైనంత వరకూ మార్పులు చేయాలని భావించిన మేనేజ్మెంట్కు బుమ్రా నిరాశనే మిగిల్చాడు. మొదటి టెస్టు అనంతరం గాయానికి లోనైన బుమ్రా కోలుకుంటాడని భావించారు. కానీ, అతడు ఇంకా గాయం నుంచి వంద శాతం కోలుకోలేదని తెలుస్తోంది. దీంతో లార్డ్స్ వేదికగా ఆగస్టు 9నుంచి జరిగే రెండో టెస్టులో బుమ్రా ఆడే దానిపై అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.
ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కు ముందు భారత్.. ఐర్లాండ్తో రెండు టీ20లు ఆడింది. ఐర్లాండ్తో తొలి టీ20లో బుమ్రాకు గాయమైంది. ఈ కారణంగానే అతడు ఇంగ్లాండ్తో టీ20, వన్డే సిరీస్కు దూరమయ్యాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో భాగంగా తొలి మూడు టెస్టులకు అతను కోలుకుంటాడని భావించిన బీసీసీఐ జట్టులో స్థానం కల్పిస్తూ తుది జట్టు ప్రకటించింది. ఈ క్రమంలో.. తొలి టెస్టులో బుమ్రా ఆడలేడని.. రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని తెలిపింది.
కానీ, బుమ్రా గాయం నుంచి ఇంకా వందశాతం కోలుకోలేదని తెలుస్తోంది. నెట్స్లో బంతులు వేస్తున్నప్పటికీ అతడు ఇంకా పూర్తి సన్నద్ధంగా లేడని చెబుతున్నారు జట్టు ఫిజియోలు. ఈ కారణంగానే అతడు లార్డ్స్లో ఆగస్టు 9నుంచి జరిగే టెస్టుకు అందుబాటులో ఉండే దానిపై అనుమానాలు నెలకొన్నాయి. మరో బౌలర్ భువనేశ్వర్ కుమార్ కూడా గాయం కారణంగానే టెస్టుల్లో ఆడటం లేదు.
ఫాస్ట్ బౌలింగ్కు అనుకూలించే ఇంగ్లాండ్ పిచ్లపై ఆడే సమయంలో భారత పేసర్లు భువనేశ్వర్, బుమ్రా దూరం కావడం దురదృష్టకరమైన విషయమే. వీరితో పాటుగా బ్యాట్స్మెన్పై కూడా టీమిండియా మేనేజ్మెంట్ దృష్టిసారించింది.