నాటింగ్హామ్: ఇంగ్లాండ్తో జరిగిన తొలి రెండు టెస్టుల్లో టీమిండియా బ్యాట్స్మెన్ దారుణంగా విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. గడిచిన రెండు టెస్టుల మాదిరి కాకుండా.. భిన్నంగా ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియాపై సీనియర్ క్రికెట్.. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ స్పందించారు. మూడో టెస్ట్కు ముందు బ్యాట్స్మెన్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. అయితే తొలి రోజు కెప్టెన్ విరాట్ కోహ్లి (97), వైస్ కెప్టెన్ అజింక్య రహానే (81) నాలుగో వికెట్కు 159 పరుగులు జోడించడంతో టీమ్ చెప్పుకోదగిన స్కోరు సాధించింది.
తొలి రోజు 6 వికెట్లకు 307 పరుగులు చేసి పరవాలేదనిపించింది. అయితే ప్రస్తుతం ఇండియన్ బ్యాట్స్మెన్ తమ కెరీర్లను కాపాడుకోవడం కోసం ఆడుతున్నారని బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్ అన్నాడు. ప్లేయర్స్ చాలా ఒత్తిడిలో ఉన్నారు. వాళ్లు వాళ్ల కెరీర్ల కోసం ఆడుతున్నారు. మాకు ఆ విషయం తెలుసు అని బంగార్ తొలి రోజు ఆట ముగిసిన తర్వాత అన్నాడు. అనుకున్నదేదీ జరగని ఇలాంటి సమయాల్లో సహనంగా ఉండటం చాలా అవసరం.
పరిస్థితులు అనుకూలించినా, అనుకూలించకపోయినా ఒకేలా ఉండటం మంచిది, అది మెరుగ్గా రాణించడానికి సాయపడుతుంది అని బంగార్ చెప్పాడు. బ్యాట్స్మెన్ వైఫల్యం బ్యాటింగ్ కోచ్గా సంజయ్ బంగార్పైన కూడా తీవ్ర విమర్శలు తెచ్చిపెట్టింది. అయితే బ్యాట్స్మెన్ రాణించడానికి తమ దగ్గర మంత్రదండమేమీ లేదని, గత ఐదు టెస్టుల్లో మన బ్యాట్స్మెన్ చాలా కఠిన పరిస్థితుల్లో ఆడిన విషయాన్ని గుర్తుంచుకోవాలని అతనన్నాడు.
బ్యాట్స్మెన్ తమ టెక్నిక్ను మార్చుకోవడం మూడో టెస్ట్లో సాయపడిందని బంగార్ చెప్పాడు. ముఖ్యంగా ఓపెనర్లు శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ ఆడిన తీరే దీనికి నిదర్శనమని అతను తెలిపాడు. ఇలాగే ఆడితే రానున్న టెస్టుల్లో కచ్చితంగా మరింత మెరుగైన స్కోర్లు నమోదవుతాయని సంజయ్ స్పష్టంచేశాడు. బ్యాట్స్మెన్లో క్రమశిక్షణ కూడా చాలా పెరిగిందని చెప్పాడు.