ఐదుగురు బౌలర్లు..
స్టార్ స్పోర్ట్స్ గేమ్ ప్లాన్ షోలో పాల్గొన్న ఈ బీజేపీ ఎంపీ భారత జట్టులో ఎంతమంది బౌలర్లను ఎంచుకుంటారనే ప్రశ్నకు సమాధానమిస్తూ ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగాలని సూచించాడు. 'కచ్చితంగా ఐదుగురు బౌలర్లతో ఆడాలని నేను గట్టిగా నమ్ముతున్నా. కాబట్టి, 7వ స్థానంలో అక్షర్ పటేల్ను ఎంపిక చేస్తా. అక్షర్ బ్యాట్తోనూ రాణించగలడు. సిడ్నీ టెస్టు తర్వాత అశ్విన్లో మరింత ఆత్మవిశ్వాసం పెరిగింది. 8వ స్థానానికి అశ్విన్ను తీసుకుంటా. దీంతో జట్టుకు 350 స్కోరు దాటే అవకాశం ఉంది. మరోవైపు ఇంగ్లండ్ బ్యాట్స్మెన్ను ఎదుర్కొనేందుకు కట్టుదిట్టమైన బౌలర్లు అవసరం. తొలి టెస్టు కోసం జస్ప్రీత్ బుమ్రాను తీసుకుని.. రెండో మ్యాచ్లో విరామాన్ని ఇచ్చి, పింక్-బాల్ టెస్టుకు సన్నద్ధమవడానికి సూచనలిస్తా'అని తెలిపాడు.
ఇషాంత్కు నో చాన్స్..
ఇక సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మను కాదని గంభీర్.. మహ్మద్ సిరాజ్ను తుది జట్టులోకి తీసుకున్నాడు. గాయం కారణంగా ఇషాంత్ శర్మ ఆసీస్ పర్యటనకు దూరం కాగా.. తండ్రి మరణించినా అతని కలను సాకారం చేసేందుకు సిరాజ్ అక్కడే ఉన్నాడు. మెల్బోర్న్ టెస్ట్తో సుదీర్ఘ ఫార్మాట్లోకి అరంగేట్రం చేసి అద్భుత ప్రదర్శన కనబర్చాడు. గబ్బా టెస్ట్లో ఐదు వికెట్లు పడగొట్టి చారిత్రక విజయంలో కీలకపాత్ర పోషించాడు.
మయాంక్ వేచి చూడాలి..
టీమిండియా గత హోమ్ సీజన్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన మయాంక్ అగర్వాల్ను ఒక్క సిరీస్లో విఫమయ్యాడని పక్కనపెట్టడం ఎంత వరకు సమంజసమని గంభీర్ను ప్రశ్నించగా.. ఈ కర్ణాటక బ్యాట్స్మన్ అరంగేట్రంలో రాణించినా ఆ జోరును కొనసాగించలేకపోయాడన్నాడు. అతని టైమ్ కోసం వేచి చూడాల్సిందేనని ఈ బీజేపీ ఎంపీ చెప్పుకొచ్చాడు. 'క్రీడల్లో ఇలానే ఉంటుంది. నువ్వు సరిగ్గా రాణించలేకపోతే మరోకరి అవకాశం వస్తుంది. అతను బాగా రాణిస్తే.. మన టైమ్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. కెరీర్ ప్రారంభంలో మయాంక్ టన్నుల కొద్ది పరుగులు చేశాడనడంలో ఎలాంటి సందేహం లేదు. 'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
శుభ్మన్ రాణించడంతో..
ఆస్ట్రేలియా పర్యటనలో మయాంక్ అగర్వాల్ విఫలమవ్వడంతో శుభ్మన్కు అవకాశం దక్కిందని, అతను అద్భుతంగా రాణించాడని గంభీర్ గుర్తు చేశాడు. 'స్వదేశంలో రాణించిన మయాంక్ ఆస్ట్రేలియా పర్యటనలో తేలిపోయాడు. అతని స్థానంలో చోటు దక్కించుకున్న శుభ్మన్ గిల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. కాబట్టి మయాంక్ తన టర్న్ కోసం వేచి చూడాల్సిందే. టీమ్మేనేజ్మెంట్ మయాంక్కు అండగా ఉంటుంది. అతన్ని జట్టుతోనే కొనసాగిస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను.'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
గంభీర్ టీమ్:
శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రిషభ్ పంత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.