పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రవిశాస్త్రి
ముందుగా టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి నాలుగో టెస్ట్ మ్యాచుకు ముందు హాజరవగా.. అతనితో పాటు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఆ కార్యక్రమానికి వెళ్లాడు. అక్కడే రవిశాస్త్రికి కరోనా సోకగా.. అతని నుంచి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్లకు కూడా వైరస్ సోకింది. అనంతరం టీమ్ ఫిజియో నితిన్ పటేల్ కూడా కరోనా బారిన పడ్డాడు. దాంతో భారత్ తప్పిదాన్ని ఈసీబీ ఎత్తిచూపుతోంది. రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ ఆ పబ్లిక్ ఈవెంట్కి కనీసం ఈసీబీ నుంచి పర్మీషన్ కూడా తీసుకోలేదట. ఈసీబీ ఇద్దరిపై మండిపడినా.. విషయం మాత్రం బయటికి రాలేదు.
మ్యాచ్ రద్దు
ఇక ఐదో టెస్టుకు ముందు రోజు గురువారం (సెప్టెంబర్ 9) సాయంత్రం టీమిండియా జూనియర్ ఫిజియో యోగేశ్ పర్మార్కి కరోనా పాజిటివ్గా తేలింది. అయితే అతడితో పలువురు భారత ఆటగాళ్లు ప్రైమరీ కాంటాక్ట్లుగా ఉన్నారని తెలిసింది. దాంతో ఆటగాళ్లందరికీ ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేయగా.. నెగెటివ్గా తేలింది. అయినా భారత జట్టు ముందు జాగ్రత్త చర్యగా చివరి టెస్టులో ఆడలేమని బీసీసీఐకి లేఖ రాసింది.
ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఈసీబీ, బీసీసీఐ బోర్డుల పెద్దలు చర్చించి మ్యాచ్ను రద్దు చేశారు. ఇక ఈ సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఐదో మ్యాచ్పై స్పష్టత లేకపోవడంతో సిరీస్ ఫలితం కూడా తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే సిరీస్ ఫలితంపై పరిష్కారం చూపాలని ఇంగ్లండ్ బోర్డు ఐసీసీకి లేఖ రాసింది.
సరైన పరిష్కారం చూపాలని
ఇదో టెస్ట్ మ్యాచ్ సిరీస్ ఫలితంను నిర్ణయిస్తుంది. భారత్ గెలిస్తే 3-1తో సిరీస్ దక్కుతుంది. అదే ఇంగ్లండ్ గెలిస్తే 2-2తో సమం అవుతోంది. డ్రా అయితే 2-1తో సిరీస్ భారత్ సొంతమవుతుంది. అందుకే ఐసీసీకి ఈసీబీ లేఖ రాసింది. ఈ విషయంపై ఇరు బోర్డుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఐసీసీ డిస్ప్యూట్ రిసొల్యూషన్ కమిటీ (డీఆర్సీ)కి లేఖ రాశామని ఈసీబీ ప్రతినిధి ఒకరు ఓ మీడియాకు చెప్పారు.
కరోనా కేసుల వల్ల ఈ మ్యాచ్ రద్దయిందని ప్రకటిస్తే.. తమకు 40 మిలియన్ పౌండ్ల నష్టం వాటిల్లుతుందని, ఇలాంటి పరిస్థితుల్లో సరైన పరిష్కారం చూపితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే వీలుందని ఇంగ్లీష్ బోర్డు ఆశిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఐసీసీని సాయం చేయాలని ఈసీబీ కోరింది.
ఐసీసీ ముందున్న ప్రత్యామ్నాయాలు ఇవే
# ఒకవేళ ఐదో టెస్టును గనుక ఐసీసీ పూర్తిగా రద్దు చేస్తే.. భారత్ 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంటుంది. అప్పుడు దీన్ని నాలుగు టెస్టుల సిరీస్గానే పరిగణిస్తారు.
#టీమిండియానే ఈ మ్యాచ్లో ఆడటానికి విముఖత చూపిన నేపథ్యంలో ఇంగ్లండ్కు అనుకూలంగా నిర్ణయం తీసుకోవచ్చు.
చివరి టెస్టులో ఆడటానికి ఆ జట్టు సిద్ధంగా ఉన్నా.. భారత్ ఒప్పుకోని పక్షంలో ఫలితాన్ని ఇంగ్లండ్కే కేటాయిస్తారు. దీంతో 2-2తో సిరీస్ సమానంగా మారుతుంది. అప్పుడు ఇంగ్లండ్ బోర్డు ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకునే వీలుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.
రీషెడ్యూల్ కోసం రంగంలోకి గంగూలీ
ఐదో టెస్ట్ మ్యాచ్ రద్దవడంతో ఈసీబీకి సుమారు రూ.200 కోట్లు నష్టం రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో భవిష్యత్లో ఈ మ్యాచ్ తిరిగి నిర్వహించడానికి బీసీసీఐ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు ఈసీబీతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఇదే విషయంపై ఈసీబీ ప్రతినిధులతో మాట్లాడేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ త్వరలో ఇంగ్లండ్కు వెళ్లనున్నాడని తెలిసింది. సెప్టెంబర్ 22న లేదా 23న గంగూలీ అక్కడికి వెళ్లి ఈసీబీతో పాటు మ్యాచ్ ప్రసార హక్కుదారులతో చర్చలు జరుపుతాడని సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈలోపు ఐసీసీ ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. దాదా పర్యటన రద్దవనుంది.
ఐపీఎల్ కోసమే
ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్ సజావుగా జరిగేందుకే చివరి టెస్ట్ రద్దు నాటకానికి తెరదిసారని ఇంగ్లండ్ మీడియా, ఆదేశ మాజీ క్రికెటర్లు కోహ్లీసేనపై దుమ్మెత్తిపోస్తున్నారు. కాసులు కురిపించే క్యాష్ రిచ్ లీగ్లో ఒక్క మ్యాచ్కు కూడా ఇబ్బంది రాకుండా ఉండాలనే భారత క్రికెటర్లు చివరి టెస్టు నుంచి తప్పుకున్నారని, వారికి టెస్టులకంటే ఐపీఎల్ అంటేనే ప్రాధాన్యత అని మండిపడ్డారు. రెండో కోవిడ్ టెస్ట్ 'నెగెటివ్' రిపోర్టు వచ్చాకే యూఏఈ బయల్దేరిన వీరు అదే రిపోర్టుతో ఒక రోజు ఆలస్యంగా టెస్టు ఆడితే ఏమయ్యేదని ప్రశ్నించారు. టెస్టు సిరీస్లో భారత్, ఇంగ్లండ్ కాకుండా చివరకు 'డబ్బు' గెలిచిందని ఘాటుగా విమర్శించారు.