
బెయిర్స్టో స్థానంలో రూథర్ఫోర్డ్
సన్రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ జానీ బెయిర్స్టో స్థానంలో వెస్టిండీస్ బ్యాట్స్మన్ షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ని తీసుకుంది. ఈ విషయాన్ని ఎస్ఆర్హెచ్ ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. మంచి హిట్టర్ అయిన రూథర్ఫోర్డ్ పలు ప్రాంచైజ్ లీగుల్లో ఆడుతున్నాడు. బెయిర్స్టో తప్పుకోవడంతో ఎస్ఆర్హెచ్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్కు లైన్ క్లియర్ అయినట్టే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. వార్నర్ కచ్చితంగా ఓపెనర్గా ఆడుతాడని అంటున్నారు. ఇక రూథర్ఫోర్డ్ 2018లో వెస్టిండీస్ జట్టు తరఫున అరంగేట్రం చేసి 6 టీ20లు ఆడాడు. 43 పరుగులు చేసి ఒక వికెట్ పడగొట్టాడు.
గతేడాది ముంబై
ఐపీఎల్ 2020లో ముంబై ఇండియన్స్ తరఫున బరిలో దిగిన కరేబియన్ క్రికెటర్ షెర్ఫేన్ రూథర్ఫోర్డ్.. ఒక్క మ్యాచ్లో కూడా ఆడలేదు. ముంబై జట్టు ఫైనల్తో సహా 16 మ్యాచ్లాడినా.. ఆఖరి వరకు రూథర్ఫర్డ్ రిజర్వ్ బెంచ్కే పరిమితమయ్యాడు. ఈసారి అతడు వేలంలోకి రాగా.. ఎవరూ ఆసక్తి చూపలేదు. జానీ బెయిర్స్టో లీగ్ నుంచి తప్పుకోవడంతో ఇలా అదృష్టం కలిసొచ్చింది.
రూథర్ఫోర్డ్ గతేడాది ఐపీఎల్ ఆదివాకపోయినా.. పీఎస్ఎల్ 2020లో కరాచీ కింగ్స్ తరఫున ఆడాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. గతేడాది రూథర్ఫోర్డ్ ప్రాతినిథ్యం వహించిన ముంబై, కరాచీ రెండు జట్లు టైటిల్ నెగ్గాయి.

మలన్ స్థానంలో మార్క్రమ్
ఇక డేవిడ్ మలన్ స్థానంలో దక్షిణాఫ్రికా క్రికెటర్ అడెన్ మార్క్రమ్ పంజాబ్ కింగ్స్ జట్టులోకి వచ్చాడు. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ తమ ట్విట్టర్ ద్వారా పేర్కొంది. 'ఐపీఎల్ 2021 మిగతా సీజన్లో డేవిడ్ మలన్ ఆడటం లేదు. టీ20 ప్రపంచకప్, యాషెస్ సిరీస్ వెంట వెంటనే ఉండటంతో అతడు తన కుటుంబంతో కొంత సమయం గడపాలనుకుంటున్నాడు. అతడి స్థానంలో దక్షిణాఫ్రికా క్రికెటర్ అడెన్ మార్క్రమ్ ఆడనున్నాడు' అని పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ట్వీట్ చేసింది. క్రిస్ వోక్స్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ మరో ఆటగాడిని ప్రకటించాల్సి ఉంది.
క్వారంటైన్ అనంతరం
ఇదివరకే పలువురు ఇంగ్లండ్ స్టార్ ఆటగాళ్లు వివిధ కారణాల చేత లీగ్ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్కు చెందిన జోస్ బట్లర్, జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ ఐపీఎల్కు అందుబాటులో ఉండమని ప్రకటించారు. మొత్తంగా మలిదశ ఐపీఎల్లో ఇంగ్లండ్ ఆటగాళ్ల మెరుపులు లేకపోవడంతో లీగ్ కళ తప్పనుందని అభిమానులు నిరాశ చెందుతున్నారు. భారత జట్టు సహాయక సిబ్బంది కరోనా బారిన పడటంతో ఐదు టెస్టుల సిరీస్లో చివరి టెస్టు మ్యాచ్ను వాయిదా వేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్, ఇంగ్లండ్ ఆటగాళ్లను ఆయా జట్ల యాజమాన్యాలు ప్రత్యేకంగా దుబాయ్ తరలిస్తున్నాయి. అక్కడ ఆరు రోజుల క్వారంటైన్ అనంతరం ఆటగాళ్లు తమ జట్టు సభ్యులతో చేరనున్నారు.


Click it and Unblock the Notifications












