సౌతాంప్టన్: నాలుగో టెస్టులో ఇంగ్లాండ్ కుప్పకూలే ప్రమాదం నుంచి తప్పించుకుంది. ఆల్రౌండర్ శామ్ కరన్ మరోసారి గొప్ప పట్టుదల ప్రదర్శించిన వేళ ఆ జట్టు తొలి ఇన్నింగ్స్లో 246 పరుగులతో ముగించగలిగింది. గురువారం టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ దిగిన ఇంగ్లాండ్ను భారత పేసర్లు బుమ్రా (3/46), షమీ (2/51), ఇషాంత్ శర్మ (2/26) ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ను కుదురుకోనీయలేదు. బంతి అనూహ్యంగా వికెట్ల మీదకు వస్తుండడంతో ఇంగ్లిష్ ఆటగాళ్లు క్రీజులో నిలవలేకపోయారు.
ముఖ్యంగా కళ్లుచెదిరే బంతులతో బ్యాట్స్మెన్కు పరీక్ష పెట్టిన బుమ్రా..ఓపెనర్ జెన్నింగ్స్ (0)ను ఎల్బీగా ఔట్ చేశాడు. రూట్ (4) కూడా ఎక్కువసేపు నిలవలేకపోయాడు. కాసేపటికే బుమ్రా వేసిన ఇన్స్వింగర్కు బెయిర్స్టో (6) పంత్కు క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. పాండ్య బౌలింగ్లో కుక్ (17) ఔటయ్యాడు. లంచ్ విరామానికి ఇంగ్లాండ్ 57/4తో కష్టాల్లో పడింది.
లంచ్ తర్వాత బెయిర్స్టో (23), స్టోక్స్ (21) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. షమి కొద్ది తేడాతో వీళ్లిద్దరిని ఔట్ చేయడంతో ఇంగ్లాండ్ 86/6తో పీకలోతు కష్టాల్లో పడిపోయింది. కానీ కరన్, మొయిన్ అలీ (40) 85 బంతుల్లో 2ఫోర్లు, 2సిక్సులతో కలిసి ఇంగ్లాండ్ను ఆదుకున్నాడు. భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఈ జోడీ ఏడో వికెట్కు విలువైన 81 పరుగులు జత చేసింది. ఈ జంటను అశ్విన్ విడగొట్టాడు.
రషీద్ (6) ఎక్కువసేపు నిలవకపోయినా.. బ్రాడ్ (17)తో కలిసి కరన్ భారత బౌలర్లను విసిగించాడు. బ్రాడ్ను బుమ్రా ఎల్బీగా ఔట్ చేయడం.. కాసేపటికే కరన్ను అశ్విన్ (2/40) బౌల్డ్ చేయడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్కు తెరపడింది. భారత ఇన్నింగ్స్లో నాలుగు ఓవర్లే పడగా.. ధావన్, రాహుల్ వికెట్ పడకుండా కాచుకున్నారు. కెప్టెన్సీ చేపట్టాక విరాట్ కోహ్లి తొలిసారి మార్పుల్లేకుండా టెస్టు జట్టును కొనసాగించడం విశేషం.