
హైదరాబాద్: సౌతాంప్టన్ వేదికగా భారత్తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు లంచ్ విరామానికి 32 ఓవర్లు ముగిసే సరికి 3 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ జో రూట్(30), జానీ బెయిర్స్టో(0) పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 65 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఓవర్ నైట్ స్కోరు 6/0తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 24 పరుగుల వద్ద ఓపెనర్ అలిస్టర్ కుక్ (12) వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ 12.1వ ఓవర్లో బుమ్రా వేసిన బంతిని ఎదుర్కొన్న కుక్(12) స్లిప్లో ఉన్న కేఎల్ రాహుల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాటపట్టాడు.
ఇన్నింగ్స్ 15.4వ ఓవర్లో ఇషాంత్ శర్మ వేసిన బంతిని ఎదుర్కొన్న మొయిన్ అలీ(9) కేఎల్ రాహుల్కే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో కేఎల్ రాహుల్ ఫీల్డింగ్లో అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ సిరీస్లో ఇప్పటి వరకు రాహుల్ 11 క్యాచ్లు పట్టాడు. తద్వారా ఒక సిరీస్లో ఎక్కువ క్యాచ్లు అందుకున్న భారత ఫీల్డర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు.
2004లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో రాహుల్ ద్రవిడ్ మొత్తం 13 క్యాచ్లను అందుకుని అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. అతని తర్వాత 1972-73లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టు సిరీస్లో సోల్కర్ 12 క్యాచ్లతో రెండో స్థానంలో ఉన్నాడు. తాజాగా ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్లో ఇప్పటికే 11 క్యాచ్లను అందుకున్న కేఎల్ రాహుల్ ఈ జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.
ఈ దశలో కెప్టెన్ జో రూట్, మరో ఓపెనర్ కీటన్ జన్నింగ్స్ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. కానీ షమీ వేసి 32వ ఓవర్ ఐదో బంతికి జెన్నింగ్స్(36) ఎల్బీగా పెవిలియన్కు చేరాడు. భారత బౌలర్లలో బుమ్రా, ఇషాంత్ శర్మ, షమీ తలో వికెట్ తీసుకున్నారు.