

లండన్: ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా ఇండియా-ఇంగ్లాండ్ జట్లు కీలక సమరానికి సిద్ధమయ్యాయి. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా శనివారం ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ప్రారంభంకానుంది. సిరీస్లో నిలవాలంటే ఖచ్చితంగా నెగ్గి తీరాల్సిన మ్యాచ్లో విరాట్ కొహ్లీ సేన ఇంగ్లండ్కు సవాల్ విసురుతోంది.
వరుస విజయాలతో ఇంగ్లీష్ టీమ్ జోరు మీదుండగా.. వరుస ఓటములతో టీమిండియా ఒత్తిడిలో ఉంది. దీంతో నాటింగ్హామ్లోని ట్రెంట్బ్రిడ్జ్ వేదికగా జరుగనున్న టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లండ్పై బదులు తీర్చుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భారత బ్యాట్స్మెన్ వైఫల్యంతో రెండు టెస్టుల్లోనూ టీమిండియా ఓడిపోయింది.
తొలి టెస్టులో బౌలింగ్లో అంచనాలకు మించి రాణించి విజయానికి చేరువగా వచ్చిన కోహ్లీసేన బ్యాటింగ్ తడబాటుతో లార్డ్స్ టెస్ట్లో ఆతిథ్య జట్టుకు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. టెస్టుల్లో నంబర్ వన్ జట్టుగా ఎన్నో అంచనాల మధ్య ఇంగ్లాండ్లో అడుగుపెట్టిన టీమిండియా ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో నిలబడాలంటే మూడో టెస్ట్లో గెలుపు తప్పనిసరి.
కెప్టెన్ కోహ్లీ గాయం నుంచి కోలుకోవడం టీమిండియాకు సానుకూల అంశం. మూడో టెస్టులో టీమిండియా భారీ మార్పులు చేసే అవకాశం ఉంది. తొలి రెండు టెస్టుల్లో విఫలమైన మురళీ విజయ్, రాహుల్ స్థానాల్లో శిఖర్ ధావన్, కరుణ్ నాయర్లను బరిలోకి దింపే అవకాశాలున్నాయి. ఇక, బౌలింగ్ విషయానికి వస్తే డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ట్రెంట్బ్రిడ్జ్ టెస్ట్ ఆడటం దాదాపు ఖాయమే.
బుమ్రా జట్టులోకొస్తే ఉమేష్ యాదవ్ రిజర్వ్ బెంచ్కే పరిమితమవ్వాలి. ఈ సిరిస్లో పెద్దగా రాణించని పాండ్యాను మూడో టెస్టులో పక్కనపెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. స్పిన్నర్లకు అనుకూలించిన ట్రెంట్బ్రిడ్జ్ పిచ్పై ఒకే ఒక్క స్పిన్నర్తో టీమిండియా బరిలోకి దిగే అవకాశం ఉంది.
ఇక, ఇంగ్లాండ్ సైతం ఈ సిరిస్ను ట్రెంట్ బ్రిడ్జ్లోనే ముగింపు పలకాలని భావిస్తోంది. ఇప్పటికే 2-0తో సిరీస్ ఆధిక్యంలో ఉన్న ఇంగ్లాండ్ ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ను క్లీన్ స్వీప్ చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఇందులో భాగంగా లార్డ్స్ టెస్ట్లో భారత్ జట్టును చిత్తు చేసిన జట్టుతోనే మూడో టెస్ట్లో కూడా బరిలోకి దిగనుంది.
ఇక, మూడో టెస్టు మ్యాచ్ జరుగుతున్న ట్రెంట్ బ్రిడ్జ్ వేదికలో ఇప్పటివరకు టీమిండియా ఆతిథ్య ఇంగ్లాండ్తో ఆరు మ్యాచ్లు ఆడింది. 1959లో ఈ మైదానంలో తొలి టెస్టు ఆడిన భారత్ ఇన్నింగ్స్ 59 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ తర్వాత 1996, 2002లో రెండు టెస్టులు ఆడగా ఆ రెండింటినీ డ్రా చేసుకుంది.
2007లో మొదటిసారి ఈ మైదానంలో భారత్కు విజయం లభించింది. ఈ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్లాండ్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. 2011లో జరిగిన మరో టెస్టులో ఇంగ్లాండ్ 319 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక చివరిగా 2014లో ఇరు జట్ల మధ్య జరిగిన టెస్టు డ్రాగా ముగిసింది. దీనిని చూస్తుంటే ఈ మైదానం భారత్కు కాస్త కలిసొచ్చేలా కనిపిస్తోంది.
ఆరు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్ల్లో ఓడిన భారత్ మూడింటిని డ్రాతో ముగించగా ఒక్క దాంట్లో విజయం సాధించింది. అలాగే ఇప్పటి వరకు ఇంగ్లాండ్ ఈ మైదానంలో 61 టెస్టులు ఆడగా 22 మ్యాచ్ల్లో విజయం సాధించింది. పదిహేడు మ్యాచ్ల్లో పరాజయం పాలవ్వగా... 22 మ్యాచ్లను డ్రా చేసుకుంది.