

హైదరాబాద్: ఎట్టకేలకు ఇంగ్లీషు గడ్డపై కోహ్లీసేన విజయాన్ని నమోదు చేసింది. నాటింగ్హామ్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్తో జరిగిన మూడో టెస్టులో టీమిండియా 203 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తాజా విజయంతో ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో 1-2తో నిలిచి టీమిండియా తన ఆశలను సజీవంగా ఉంచుకుంది.
ఓవర్ నైట్ స్కోరు 311/9తో చివరిరోజు ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఇంగ్లాండ్ మరో ఆరు పరుగులు మాత్రమే జోడించి వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మన్ జేమ్స్ ఆండర్సన్ (11) పరుగుల వద్ద రహానేకు క్యాచ్ ఇవ్వడంతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది.
జోస్ బట్లర్ (106) సెంచరీ, స్టోక్స్ (62) హాఫ్ సెంచరీ చేసినా.. ఇంగ్లండ్ను గట్టెక్కించలేకపోయారు. రెండో ఇన్నింగ్స్లో సెంచరీ నమోదు చేసిన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు విరాట్ కోహ్లీకి దక్కింది. భారత బౌలర్లలో బుమ్రా ఐదు, ఇషాంత్ శర్మ 2, అశ్విన్, షమీ, పాండ్యా తలో వికెట్ తీసుకున్నారు.
భారత్ తొలి ఇన్నింగ్స్లో 329 పరుగులు చేయగా, భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 161 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. ఇక, రెండో ఇన్నింగ్స్లో 7వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసి ఇండియా డిక్లేర్ ప్రకటించగా, ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 317 పరుగులు చేసి ఆలౌటైంది.
రెండో ఇన్నింగ్స్ ఆరంభంలో పేసర్ల విజృంభణకు ఇంగ్లండ్ తొలి సెషన్లోనే 62 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో జోస్ బట్లర్, బెన్ స్టోక్స్ అద్భుత ఆటతీరును కనబరుస్తూ సెంచరీ భాగస్వామ్యంతో నాలుగో రోజైన మంగళవారం బట్లర్ (106), స్టోక్స్ (62) హాఫ్ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడి భారత విజయాన్ని ఆలస్యం చేశారు.
దీంతో నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లండ్ 102 ఓవర్లలో 9 వికెట్లకు 311 పరుగులు చేసింది. చివరి సెషన్లో బుమ్రా కొత్త బంతితో మాయ చేస్తూ ఐదు వికెట్లతో రాణించినా టెయిలెండర్లు పట్టు వీడకపోవడంతో మ్యాచ్ ఫలితం కోసం భారత్ ఐదో రోజు వరకు ఆగక తప్పలేదు.
ఈ ట్రెంట్బ్రిడ్జ్ టెస్టుకు ఓ ప్రత్యేకత ఉంది. ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ చరిత్రలోనే చివరిరోజు ఒక వికెట్తో ఆడిన రెండో టెస్టు ఇది. అంతకముందు జులై 1976లో ఓల్ట్ ట్రాఫోర్డ్ వేదికగా వెస్టిండిస్తో జరిగిన టెస్టులో సరిగ్గా ఇలానే జరిగింది. చివరిరోజు 125/9 పరుగులతో క్రీజులోకి దిగిన ఇంగ్లాండ్ను వెస్టిండిస్ 126 పరుగులకే ఆలౌట్ చేసింది.
ఈ టెస్టులో వెస్టిండిస్ 425 పరుగుల తేడాతో విజయం సాధించింది. సుదీర్ఘ ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీసేనకు ఈ విజయం ఊరటనిచ్చే అంశం. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు సౌతాంప్టన్ వేదికగా ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా జరిగిన మొదటి రెండు టెస్టుల్లో టీమిండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే.
ఇన్నింగ్స్ వివరాలు:
తొలి ఇన్నింగ్స్:
ఇండియా: 329
ఇంగ్లాండ్: 161
రెండో ఇన్నింగ్స్:
ఇండియా: 352/7 డిక్లేర్
ఇంగ్లాండ్: 317