తడబడ్డ ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్
కెప్టెన్ జో రూట్ 156 బంతుల్లో 9 ఫోర్లు సాయంతో (80) .. జెన్నింగ్స్ 98 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో (42), బెయిర్ స్టో 88 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో (70) చక్కటి భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టును పటిష్ట స్థితికి చేర్చినా.. చివరి సెషన్లో భారత్ ఆరు వికెట్లు పడగొట్టడంతో పరిస్థితి తల్లకిందులైంది. కుర్రన్ (24), అండర్సన్ (0) క్రీజులో ఉన్నారు. రెండో రోజు భారత బ్యాట్స్మెన్ ఎలా ఆడతారన్నది ఆసక్తికరం.
లంచ్ విరామానికి పరవాలేదు:
నిజానికి బుధవారం ఆటలో 70 శాతం వరకు ఇంగ్లాండ్దే పైచేయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ ఎనిమిదో ఓవర్లోనే కుక్ (13) వికెట్ను కోల్పోయినప్పటికీ.. కెప్టెన్ రూట్ అద్భుత బ్యాటింగ్తో ఆ జట్టు తిరుగులేని స్థితికి చేరుకుంది. వన్డే సిరీస్లో భారత బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న రూట్.. టెస్టు మ్యాచ్లోనూ అదే ఫామ్ కొనసాగించాడు. ఏ తడబాటూ లేకుండా బ్యాటింగ్ చేశాడు. ఆరంభంలోనే ఔటయ్యే ప్రమాదం తప్పించుకున్న జెన్నింగ్స్.. రూట్కు చక్కటి సహకారం అందించాడు. దీంతో లంచ్ విరామానికి 83/1తో మంచి స్థితిలో నిలిచింది.
ఒకానొక దశలో భారత బౌలర్లను:
విరామం తర్వాత కాసేపటికే జెన్నింగ్స్ ఔటయ్యాడు. తర్వాత వచ్చిన మలన్ (8) ఎంతోసేపు క్రీజులో నిలవలేదు. షమి బౌలింగ్లో వికెట్ల ముందు దొరికాడు. సమీక్ష కోరినా ఫలితం లేకపోయింది. 112/3తో ఇంగ్లాండ్ ఇబ్బందుల్లో పడ్డట్లే కనిపించింది. కానీ రూట్కు జత కలిసిన బెయిర్ స్టో భారత బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు. వీళ్లిద్దరూ దూకుడుగా ఆడుతూ.. భారత బౌలర్ల లయను దెబ్బ తీశారు. సెంచరీ భాగస్వామ్యంతో జట్టును పటిష్ట స్థితికి చేర్చారు.
చెలరేగిపోయిన భారత బౌలర్లు:
టీ విరామానికి స్కోరు 163/3 కాగా.. మూడో సెషన్లోనూ ఈ జోడీ జోరు కొనసాగించింది. స్కోరు 200 దాటింది. ఐతే ఇంగ్లాండ్ పూర్తిగా పట్టు సాధిస్తున్న సమయంలో రూట్ రనౌటవడంతో పరిస్థితి మారిపోయింది. తర్వాత భారత బౌలర్లు చెలరేగిపోయారు. క్రమం తప్పకుండా వికెట్లు పడగొడుతూ.. ఇంగ్లాండ్ను పతనం వైపు నడిపించారు. షమి, ఉమేశ్ (1/56) కలిపి తీసింది మూడు వికెట్లే అయినా.. చక్కగా బౌలింగ్ చేశారు. ఇద్దరూ చక్కటి బౌన్స్ రాబట్టారు. ఇషాంత్ మాత్రం నిరాశ పరిచాడు. పాండ్య తేలిపోయాడు.