
హైదరాబాద్: టీమిండియా టెస్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు. మయాంక్ జట్టులో చోటు సంపాదించడానికి రాలేదని, టీమిండియాను గెలిపించడానికి వచ్చాడని అన్నాడు. అతడు ఆడింది కొన్ని మ్యాచ్లే అయినా 60కిపైగా యావరేజిని కలిగి ఉన్నాడని కోహ్లీ అన్నాడు.
తొలి ఇన్నింగ్స్లో ఓపెనర్ మయాంక్ అగర్వాల్(243) డబుల్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో తొలి టెస్టులో టీమిండియా భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. 12 ఇన్నింగ్స్ల్లోనే మయాంక్ రెండు డబుల్ సెంచరీలు సాధించి అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. రెండో రోజు మ్యాచ్ అనంతరం మయాంక్ను కోహ్లీ ఇంటర్యూ చేశాడు.
ఈ సందర్భంగా తక్కువ మ్యాచ్ల్లోనే రెండు డబుల్ సెంచరీలు సాధించడం ఎలా ఉందని కోహ్లీని మయాంక్ని అడగ్గా ఈ ఫీలింగ్ చాలా అద్భుతంగా ఉందని చెప్పాడు. ఇక, ఫిట్నెస్ గురించి అడగ్గా అందుకు కోహ్లీయే కారణమని అన్నాడు. బాధ్యతగా ఆడి జట్టును మెరుగైన స్థితిలో ఉంచాలనే తాను ఆలోచిస్తానని మయాంక్ తెలిపాడు.
ఎక్కువ సేపు క్రీజులో ఉండడానికి గల కారణాలను వెల్లడిస్తూ క్రీజులోకి దిగిన తర్వాత ముందుకు సాగాలనే ఆలోచనతో ఆడతానని, క్రీజులో సాధ్యమైనంత ఎక్కువ సమయం ఉండేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. భారీ ఇన్నింగ్స్ ఆడేటప్పుడు ఫిట్నెస్ ముఖ్యమని చెప్పాడు.
డబుల్ సెంచరీ అనంతరం ట్రిపుల్ సెంచరీ చేయాలన్న కసితో దూకుడుగా ఆడే క్రమంలో యమాంక్ అగర్వాల్ 243 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్కు చేరాడు. మెహదీ హసన్ బౌలింగ్లో జయేద్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రెండో రోజు ఆట ముగిసేసరికి భారత్ ఆరు వికెట్ల నష్టానికి 493 పరుగులు చేసింది.